AP: ఏపీ రాజకీయం మారబోతోందా? కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా.. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. టీడీపీ హయాంలో తిరుపతిలో తన కాన్వాయ్పై రాళ్లదాడి జరిగిన తర్వాత చంద్రబాబుని దూరం పెట్టారు అమిత్షా. 2018 మార్చి 16న చివరిసారిగా వాళ్లిద్దరు భేటీ అయ్యారు. అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత కలవబోతున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో చర్చకు దారితీసింది.
వచ్చే ఎన్నికలకు పాత మిత్రులు మళ్లీ కలుస్తారా? అధికారికంగా బీజేపీ – జనసేన ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. టీడీపీని కలుపుకుని వెళ్దామని పవన్ పదేపదే బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో వెళ్తోందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని పవన్ చెప్తున్న మాట. ఇన్నాళ్లు లైట్ తీసుకున్నారు బీజేపీ అగ్రనేతలు. అయితే.. చంద్రబాబుకు అమిత్షా అపాయింట్మెంట్ ఇవ్వడంతో బీజేపీ, టీడీపీ మధ్య స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో అమిత్షా మీటింగ్ వెనక సంఘ్ పరివార్ పెద్దలు, పవన్ ఉన్నారని కూడా చెప్తున్నారు.
చంద్రబాబుతో చేతులు కలిపేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఏమాత్రం ఇష్టపడడం లేదు. గత చరిత్రను వాళ్లు తెరపైకి తెస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలపైనే అమిత్షాతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు.. తమ పార్టీకి ఫండింగ్ చేస్తున్నవారి డీటేల్స్ను సీఎం జగన్ కేంద్రానికి సమర్పించారని.. వాటి ఆధారంగా వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడం టీడీపీకి కష్టమవుతుంది. దీనిపై కూడా అమిత్షాతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు.
శనివారం రాత్రికి అమిత్షా-చంద్రబాబు సమావేశం జరుగుతుంది. ఆదివారం ఉదయం ప్రధానమంత్రి మోదీతో టీడీపీ అధినేత భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు మోదీ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఏ క్షణమైనా మీటింగ్ ఫిక్స్ అవ్వొచ్చని టీడీపీ భావిస్తోంది.