Chandrababu: వైఎస్ వివేకా హత్య కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వివేకా హత్య కేసులో.. హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు.. అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని సీబీఐ అఫిడవిట్లో స్పష్టంగా తెలిపిందని అన్నారు. వైఎస్ అవినాష్రెడ్డి ఇంట్లోనే హత్యకు కుట్ర జరిగినట్టు సీబీఐ వెల్లడించిందని చెప్పారు.
బాబాయ్ను చంపాక ఆనాడు జగన్ ఆడిన నాటకం ఎవరి ఊహకు అందదని చంద్రబాబు అన్నారు. ఈ కేసులో జగన్ గూగుల్ టేక్ అవుట్లో అడ్డంగా దొరికిపోయారన్నారు. తప్పు చేసి ఇతరులపై నెట్టివేయాలని చూశారని.. ఇలాంటి జగన్ నాటకాలు నమ్మి నరహంతకుడికి ప్రజలు ఓట్లేశారని.. ఈరోజు వారి ప్రాణాలకే రక్షణ లేకుండాపోయిందన్నారు చంద్రబాబు.
ఏపీలో ఐపీసీ చట్టం లేదని.. వైసీపీ చట్టం ఉందని మండిపడ్డారు. జగన్ కోసం అధికారులు బలిపశువులు కావొద్దని.. పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
గత సీఎంలలో కొందరు అవినీతిపరులు, మరికొందరు అసమర్థులు ఉన్నారు కానీ.. జగన్ మాదిరి విధ్వంసం చేసిన వారు మాత్రం లేరని చంద్రబాబు విమర్శించారు. ఏ సీఎం అయినా మంచిపేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారే కానీ, జగన్లా వ్యవస్థలపై దాడులు చేయరని మండిపడ్డారు.