మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ సమస్యలపై ఫోకస్ పెట్టారు. అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని కృత నిశ్చయంతో ఉన్నారు.
మన గ్రామం, మన అభివ్రద్ధి, మన ఆత్మగౌరవం అనే నినాదాలతో పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులు నిర్వహించే సదస్సులకు హాజరు కానున్నారు. పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచుల సంఘం కలిసి వీటిని నిర్వహించనున్నట్టు ఆ సంస్థల అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావు తెలిపారు.
రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి ఒకొక్క జోన్ లో ఒకొక్క చోట ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో నాలుగు జిల్లాల్లో చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 11న శ్రీకాకుళం, 12న కాకినాడ, 14న నర్సరావు పేట, 15న కడపలో జరగనున్న సదస్సుల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఐదోది ఇంకా నిర్ణయించలేదు. పార్టీల రహితంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని, అందరూ రావచ్చునని చెబుతున్నారు.
ఈ సదస్సులను ఆషామాషీగా చేయడం లేదని, కనీసం 10 వేల మందికి తక్కువ కాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. తుపాను ప్రభావం ఉంటే, అందుకు తగినట్టుగా వేదికను మార్చుతామని చెబుతున్నారు.
అయితే తుపాను నేపథ్యంలో చంద్రబాబు శ్రీశైలం పర్యటన, లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా పడ్డాయి. మరోవైపు డిసెంబర్ 7న కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసేందుకు ఢిల్లీ వెళుతున్నారు. ఈనెల 10న ఎన్నికల కమిషన్ ఒకటి అమరావతి రానుంది. ముందుగానే వారి వద్దకు వెళ్లి సమస్యలు విన్నవించాలని చూస్తున్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నా, లేకున్నా నిత్యం బిజీగానే ఉంటారనడానికి ఇదే నిదర్శనమని తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అనునిత్యం ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూనే ఉంటారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు అటు లోకేష్, ఇటు చంద్రబాబు జనంలోనే ఉంటారని అంటున్నారు. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అన్నీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.