Chandra Babu Bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం వాదోపవాదనలు జరిగాయి. ప్రభుత్వ తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాకుండానే విచారణ ప్రారంభమవ్వగా.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే తన వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవన్నారు. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ అధ్యయనం చేయగా.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదన్నారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రాజెక్ట్ ఆమోదం పొందిందనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు.
కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ ఈ ప్రాజెక్టు ఎక్విప్ మెంప్ ధరను నిర్థారించిందని, ఆ కమిటీలో చంద్రబాబు లేరని దూబే వివరించారు. అయితే ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారని, నవంబర్ 16 వరకూ ఆయన బెయిల్ ను పొడిగించారని తెలిపారు. ఎలాంటి నోటీసులు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి, 2 రోజులు కస్టడీలో విచారించి ఇప్పుడు మళ్లీ కస్టడీకి కావాలనడం సరికాదన్నారు. కేబినెట్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన సీమెన్స్ ప్రాజెక్టులో.. చంద్రబాబుపై ఎలా కేసు పెడతారని దూబే ప్రశ్నించారు.
లంచ్ బ్రేక్ అనంతరం.. ప్రభుత్వ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చంద్రబాబు కోసం.. చంద్రబాబు చుట్టూనే తిరిగిందన్నారు. ఈ సంస్థ కేవలం చంద్రబాబు కోసమే సృష్టించబడిందని.. ఈ కేసులో ఉన్న అందరు ముద్దాయిలకు ఏదొక రకంగా ఈ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత లబ్ధి చేకూరిందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా.. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం సరికాదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు.
ఈ సమయంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు పీఏ పెండ్యూల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని విదేశాలకు పారిపోయారని, దీనివెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. స్కిల్ కుంభకోణంలో మొత్తం రూ.270 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, డొల్లకంపెనీల పేరుతో నిధులను దారి మళ్లించారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసును విచారణ చేస్తుండగానే.. 2018 జులై 26న సెక్షన్ 17ఏ సవరణ జరిగిందని, ఇందులో చంద్రబాబుకి 17ఏ వర్తించదని పొన్నవోలు తెలిపారు. స్కామ్ జరిగిందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, కేసును మరింత లోతుగా విచారించేందుకు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.