Anam Vs Anil : ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నేతల మధ్య సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలకు మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
రాజీనామా చేసి వస్తే ఒకే చోట పోటీ చేద్దామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఆనం సవాల్ విసిరారు. ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. ఆనం చేసిన చాలెంజ్ పై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2024 ఎన్నికల్లో ఒకేచోట పోటీ చేద్దామని ప్రతిసవాల్ చేశారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు.
తాను నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దిగుతానని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మరి ఆనం రాంనారాయణరెడ్డి ఇక్కడ నుంచే పోటీ చేయడానికి టిక్కెట్ తెచ్చుకోగలరా అని సైటర్లు వేశారు. టీడీపీలో చేరనున్న ఆనం నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దిగే సాహసం చేస్తారా..? అనిల్ కుమార్ యాదవ్ సవాల్ స్వీకరిస్తారా..? లేక తాను పోటీ చేసే స్థానం నుంచే అనిల్ ను పోటీకి దిగమంటారా..?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో వైసీపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శల దాడిని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మరింత పెంచారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే సైకిలెక్కనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం టీడీపీ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలో నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.