Polavaram: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం.. పోలవరం పూర్తి రిజర్వాయర్ ఎత్తు 45.72 మీటర్లు అని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించాలని తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది.
అయితే ఇటీవలే పార్లమెంటు సాక్షిగా పోలవరంపై కేంద్రం విరుద్ధమైన ప్రకటన చేసింది. మొదటి దశలో 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తామని ప్రకటించింది. గతవారం వైసీపీ ఎంపీ సత్యవతి లోక్ సభ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం ఇచ్చారు. తొలిదశ సహాయ, పునరావాసం ఈ ఏడాది ఫిబ్రవరికే పూర్తి కావాల్సి ఉందన్నారు ప్రహ్లాద్ సింగ్ పటేల్.
తొలిదశలో 20 వేల నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు.
పోలవరం ఎత్తుపై గతం వారం చేసిన కేంద్రం చేసిన ప్రకటనకు.. తాజాగా కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో స్పష్టత కరువైంది. మొదటి దశలో 41.45 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ప్రకటించగా.. సోమవారం కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో.. పొలవరం ఎత్తు విషయంలో మరోసారి వివాదం రాజుకున్నట్లు అయింది.