Vizag Steel Plant News (AP Updates) : విశాఖ స్టీల్ప్లాంట్పై కేంద్రం వెనుకడుగు వేస్తోంది. విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని భావించడం లేదన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని ఫగ్గన్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు. స్టీల్ ప్లాంట్లో కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ముడిసరకుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పూర్తిస్థాయి సామర్థ్యంతో ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. దీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పొల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సింగరేణి కాలరీస్ అధికారులు స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. బిడ్డింగ్ కు సాంకేతిక కారణాలు అడ్డంగా ఉండటంతో ఈ అవరోధాలను ఎలా అధిగమించాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అసరమైతే కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. అయితే ఈ విషయంపై కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్లో పాల్గొనడమనేది ఓ ఎత్తుగడ మాత్రమేనని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ప్రైవేటీకరణను బీజేపీ మినహా ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసినట్టేనా..? లేక వ్యూహాత్మకంగా ముందుకెళుతుందా..?