NTR : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు.
ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని బాలకృష్ణ అన్నారు. ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయ రంగంలోనూ అగ్రస్థానంలో వెలుగొందారని పేర్కొన్నారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని వివరించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ తీసుకొచ్చిన 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ఆహార భద్రతగా మారిందని బాలయ్య తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన కుమారుడిగా జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేళ ఆ మహనీయుడికి అంజలి ఘటించారు. చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు అని జనసేనాని పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మంది పేదవారికి ఉపయోగపడిందని తెలిపారు.
ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారని పవన్ గుర్తు చేశారు. అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారని తెలిపారు. అటు సినిమా.. ఇటు రాజకీయ రంగంల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణంగా జనసేనాని పేర్కొన్నారు. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి తన తరఫున, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానని అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.