CBN Pawan Kalyan : రాజధాని పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్తో కలిసి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు, పవన్ మాట్లాడారు.
తెదేపా అధినేత చంద్రబాబు సంక్రాంతి వేడుకల సమావేశంలో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఈ ఐదేళ్లు వారికి చీకటి రోజులని వాపోయారు.
వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు. ‘ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారు మాట్లాడుతూ.. శుభగడియలు తలుపు తడుతున్నాయని.. ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్’ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘‘మన రాజధాని అమరావతే.. ఇది ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తుంది. సంపద సృష్టించే కేంద్రంగా, సంక్షేమ పాలన అందించేందుకు ఉపయోగపడుతుంది. జగన్కు కూల్చడమే తెలుసు.. నిర్మించడం తెలియదు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతుల పోరాడారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాలి. రాజకీయ హింస, మోసపు హామీలతో జగన్ బడుగు బలహీనవర్గాల ఉసురు తీస్తున్నారు. 32 రోజులుగా అంగన్వాడీలు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదు. పండగ పూట కూడా వారిని రోడ్డుపై ఉండేలా జగన్ చేశాడు. వైకాపా పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గిట్టుబాటు ధర లేదు.. తుపాను వచ్చి పంట నష్టపోయినా వారిని పట్టించుకోలేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యతను తెదేపా, జనసేన తీసుకుంటాయి’’ అని చంద్రబాబు హమీ ఇచ్చారు.
రాష్ట్రానికి పట్టిన కీడును,పీడను భోగి మంటల్లో కాల్చేశామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైకాపా పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని పవన్కల్యాణ్ అన్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘రాజధాని రైతులను దారుణంగా కొట్టి వేధించిన ఘటన నన్ను కలచి వేసింది. అందుకే టీడీపీ జనసేన కలసి ఉన్నాయి. మీకిచ్చిన మాట నెరవేర్చేలా ముందుకెళ్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం. జై అమరావతి అన్నప్పుడల్లా జై ఆంధ్రా నినాదాన్ని తీసుకెళ్లాలి” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇది కేవలం అమరావతి సమస్య కాదు. ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలది. మీ కష్టం రేపు శ్రీకాకుళం, పులివెందులలోనూ ఇదే సమస్య వస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులనూ వైకాపా మోసం చేసిందని, మరోసారి వైసీపీ వస్తే చీకటి భవిష్యత్తే అని పవన్కల్యాణ్ విమర్శించారు.
.
.