Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా నిందితుల జాబితాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేరును చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నాలుగుసార్లు విచారించింది.అయితే ఆ సమయంలో సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేసింది.
అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని ఆదివారం పులివెందులలో సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లోని సీబీఐ జడ్జి నివాసంలో అధికారులు ప్రవేశపెట్టారు. హత్య తర్వాత సహనిందితులు శివశంకర్రెడ్డి, గంగిరెడ్డి, గజ్జల ఉదయ్కుమార్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి ఆధారాలను చెరిపివేయడంలో భాస్కరరెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం మోపింది. భాస్కరరెడ్డి కస్టడీ కోరుతూ సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఎంపీ అవినాష్రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు. దీంతో తొలిసారిగా అవినాష్రెడ్డి పేరు నిందితుల జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది.
విచారణకు హాజరు కావాలని అవినాష్రెడ్డికి సీబీఐ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. పులివెందులలో ఉన్న ఆయనకు ఆదివారం సాయంత్రం సీబీఐ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. ఆయన వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన సీబీఐ సిట్ బృందం దూకుడు పెంచింది. వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేసి సంచలనం సృష్టించింది. దీంతో అవినాష్రెడ్డి మరోసారి సీబీఐ దర్యాప్తుపై మండిపడ్డారు. సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీబీఐ గత, ప్రస్తుత దర్యాప్తు అధికారుల తీరును తప్పుపట్టారు. మరోవైపు వివేకా హత్య కేసులో తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారనే చర్చ సాగుతోంది.