Avinash Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వెళ్లిన అవినాష్ రెడ్డి సుదీర్ఘంగా విచారించారు అధికారులు. సరిగ్గా ఐదు గంటలకు వదిలిపెట్టారు. 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సీబీఐ అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది.
ఏడు గంటల విచారణలో సీబీఐ పలు విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాట్సప్ కాల్స్, రూ.4 కోట్ల ఫండింగ్పై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అప్రూవర్ దస్తగిరిని ప్రలోభాలకు గురిచేయడంపై ప్రశ్నించినట్లు కీలక సమాచారం.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని హైకోర్టు గత నెల 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి ప్రతీ శనివారం సీబీఐ విచారణకు హాజరవుతున్నారు.
మరోవైపు, ఎంపీ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీతారెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు జూన్ 13 వాదనలు విననుంది.