Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. నాలుగు రోజుల వ్యవధిలో అవినాష్ రెడ్డి రెండుసార్లు విచారణకు డుమ్మాకొట్టారు.
తొలుత ఈ నెల 16న అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ లోనే ఉన్న అవినాష్ రెడ్డి ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ సీబీఐకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చి పులివెందుల వెళ్లిపోయారు. అదే రోజు సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణ రావాలని కోరింది.
శుక్రవారం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరుకాలేదు. తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని సీబీఐకు తన లాయర్ ద్వారా లేఖ పంపారు. తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నందున తల్లిని తాను చూసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మరి సీబీఐ తాజా నోటీసుల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా..? రాకపోతే సీబీఐ తీసుకునే స్టెప్ ఏంటి..? దీనిపై ఉత్కంఠ నెలకొంది.