Polavaram Caste Politics: పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారు వైసీపీ అధ్యక్షుడు.. ఆమె ప్రచారంలో దూసుకుపోతుంటే.. అసలు ఆమె గిరిజన బిడ్డే కాదని.. రిజర్వ్డ్ సెగ్మెంట్లో పోటీకి అనర్హురాలని నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అయితే తన తల్లిదండ్రులు గిరిజనులే అంటున్న రాజ్యలక్ష్మి .. ఆ ఆరోపణలను తిప్పికొడుతూ.. తన పని తాను చేసుకుని పోతున్నారు. ఆ వ్యవహారం కోర్టుకెక్కడంతో అసలు రాజ్యలక్ష్మి పోటీలో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల లోపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ సెగ్మెంట్లో వైసీపీ పరిస్థితి ఏంటి?
ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే అతి పెద్ద గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వం ఖరారయింది. ఇంతకాలం టీచర్ వృత్తిలో ఉన్న రాజ్యలక్ష్మి ఇప్పుడు పొలిటీషియన్ అవతారమెత్తి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. అక్కడ వరకు బాగానే ఉన్నా అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. తెల్లం రాజ్యలక్ష్మి అసలు గిరిజన మహిళ కాదు అని ఆమె బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారని.. ఆమె అభ్యర్థిత్యం రద్దు చెయ్యాలని వివిధ గిరిజన సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టి.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేయడంతో పాటు.. కోర్టుని కూడా ఆశ్రయించాయి.
గిరిజన నేత తెల్లం బాలరాజు 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆయన.. జగన్ బాట పట్టి 2012 బైపోల్స్లో మూడో సారి పోలవరంలో విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి మొడియం శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయిన బాలరాజు.. గత ఎన్నికల్లో తిరిగి పట్టు నిలబెట్టుకున్నారు. అలా నాలుగు సార్లు గెలిచిన బాలరాజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా.. గిరిజనేతురులకు, భూస్వాములకు కొమ్ము కాస్తూ.. పోలవరం నిర్వాసితులను మోసం చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఆయనపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని సర్వేల్లో తేలడంతో జగన్ ఆయన్ని పక్కనపెట్టి ఆయన భార్యకు టికెట్ ఇచ్చారంట.
Also Read: లోక్ సభ ఎన్నికలు.. సౌత్ లో సత్తా చాటేదెవరు ?
అదే పోలవరంలో రచ్చకు దారి తీసింది. తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి గిరిజన మహిళ కాదని.. గిరిజన సంఘాల నేతలు ఆధారాలు చూపిస్తున్నారు. తెల్లం రాజ్యలక్ష్మి తల్లి భీమామ్మ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కుక్కల సుబ్బారావును వివాహం చేసుకున్నారని. వారికి మొదటి సంతానంగా రాజ్యలక్ష్మి జన్మించినట్లు రికార్డులు చూపిస్తున్నారు. సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలు ప్రకారం ఆమె గిరిజనేతురాలని. రెవెన్యూ వ్వవస్థను మోసం చేసి గిరిజన కులధృవీకరణ పత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవిపై కన్ను వేశారని ఆగ్రహం వక్తం చేస్తున్నారు.
అటు ఎమ్మెల్యే బాలరాజుపై ఇప్పటికే గిరిజన వర్గాలు తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా అన్ని పదవులు గిరిజనేతరులకు కట్టబెట్టి గిరిజనులను మోసం చేసారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం నియోజకవర్గంలో మార్కెట్ యార్డు ఛైర్మెన్ పదవి గాని పార్టీ మండల అధ్యక్షుల పదవులు కాని గిరిజనలకు దక్కకుండా చేసి దశాబ్దాలుగా వారిని మోసం చేశారని గిరిజన సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంత వ్యతిరేకత మధ్య ఎమ్మెల్యే బాలరాజు గెలుపు అసాధ్యమని గ్రహించిన వైసిపి అధిష్టానం గిరిజన మహిళ కాకపోయినా తెల్లం రాజ్యలక్ష్మి కి సీటు ఇవ్వడాన్ని గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Also Read: టార్గెట్ 14 ఎంపీ సీట్లు.. ఇదే రేవంత్ వ్యూహం..
పోలవరం నియోజకవర్గంలో గిరిజన సమస్యలపై పోరాటం చేసిన ఎంతో మంది నాయకులు ఉన్నా.. వైసీపీ కనీసం వారి అభ్యర్ధిత్వాన్ని పరిశీలించకపోవడంపై గిరిజన నేతలు గుర్రుగా ఉన్నారంట. ఎమ్మెల్యే బాలరాజు డబ్బు బలంతో తన భార్యకు టికెట్ తెచ్చుకున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు తన భార్యను ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ఎక్కడ ప్రకటిస్తారో అని తన పలుకుబడితో లాబీయింగ్ మెుదలుపెట్టారంటున్నారు. ఏదిఏమైనా రాజ్యలక్ష్మి గిరిజనురాలు కాదనడానికి పక్కా ఆధారాలున్నాయని.. ఒక వేళ బాలరాజు ప్రయత్నాలు ఫలించి పోటీలో ఉంటే.. ఓడించడమే కాకుండా న్యాయస్థానంలో దోషిగా నిలబడతామని వారు హెచ్చరిస్తున్నారు.
అయితే తన కులం పై వచ్చిన ఆరోపణలను పోలవరం వైసిపి అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఖండించారు. ప్రతిపక్షాలు తనను రాజకీయం గా ఎదుర్కొలేక తన కులం పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎదుర్కోవడమే కాక అసత్య ప్రచారం చేసిన వారందరి పై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు.
అయితే తెల్లం రాజ్యలక్ష్మి అసలు ఎస్టీ కాదని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఏలూరు జిల్లా కలెక్టర్ కు సైతం ఆధారాలు సమర్పించామని అంటున్నారు ఆదివాసీ నాయకుడు మడకం వెంకటేశ్వర రావు. పోలవరం నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి కులంపై గౌరవ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ను ఆశ్రయించామన్నారు. వైసిపి అధిష్టానం మొరొకసారి తెల్లం రాజ్యలక్ష్మి అభ్యర్ధిత్వాన్ని పున:పరిశీలించాలని గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Also Read: Raghuramakrishna Raju: టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?
ఇప్పటికే ఎస్టీ కోటాలో ఉపాయధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న తెల్లం రాజ్యలక్ష్మి కులంపై క్లారిటీ ఇవ్వాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంలో భాగంగా పిటిషన్ వేశారు గిరిజన నేతలు. అయితే వ్యక్తిగత సమాచారం ఇవ్వలేమని విద్యాశాఖ అధికారులు చెప్పడం తమ అనుమానాలను మరింత పెంచుతున్నాయంటున్నారు. అధికారులు సమాచారం ఇవ్వడానికి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించామంటున్నారు. అందుకే ఎందుకైనా మంచిదని తెల్లం బాలరాజు కూడా భార్యతో పాటు డమ్మీ నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారంట. ఒకవేళ పోలింగ్ లోపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చి ఆమెపై అనర్హత వేటు పడితే.. తాను పోటీలో ఉండాలని భావిస్తున్నారంట. మొత్తమ్మీద పోలవరం కులం రగడ వైసీపీ శ్రేణుల్ని ఇప్పుడు తెగ టెన్షన్ పెడుతుందంట.