Chandrababu: చంద్రబాబును వదల బొమ్మాలి టైపులో వెంటాడుతున్నారు పోలీసులు. శుక్రవారం బాబు టూర్ కు అనేక ఆటంకాలు కలిగించగా.. శనివారం కూడా అదే టెంపో కంటిన్యూ చేశారు. అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ చంద్రబాబు మీద కేసులు పెట్టారు. ఆయనతో పాటు మరో వెయ్యి మందిపై కేసులు నమోదు చేశారు. అనపర్తి ఘటనపై డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు 143, 353, 149 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేయడం టీడీపీని షాక్ కు గురి చేసింది.
ఆయా కేసుల్లో చంద్రబాబునే ఏ1 గా నమోదు చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఏ2, జవహర్ను ఏ3గా చేర్చారు. స్వామినాయుడు, చినరాజప్ప, జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, బత్తుల ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావులపై కేసులు ఫైల్ అయ్యాయి. అనపర్తి, బిక్కవోలు పీఎస్ ల పరిధిలో మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.
అనపర్తి దేవీచౌక్ సెంటరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభకు అనుమతి లేకపోయి సభ నిర్వహించారని ఐజీ పాలరాజు అన్నారు. “అనపర్తిలో రోడ్డుపై చంద్రబాబు సభ నిర్వహించడానికి వీల్లేదని ముందే చెప్పాం. రెండు సభా స్థలాలు కూడా చూపించాం. పార్టీ నేతలతో మాట్లాడి చెబుతామని చెప్పిన స్థానిక నాయకులు.. చివరకు రోడ్డుపైనే సభ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లటానికి మాత్రమే అనుమతి ఉంది. సభకు అనుమతి లేదు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. బస్సు అద్దాలు పగలగొట్టారు. కొందరు రాళ్లు విసరడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్డుపైనే సభలు నిర్వహిస్తామంటే చట్టం తనపని తాను చేస్తుంది” అని ఐజీ పాలరాజు చెప్పారు.