Vizag : ఏపీలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో
కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత, మరో ముగ్గురి నిందితులపై విశాఖ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హోంగార్డులు శ్యామ్సుందర్ , శ్రీనుపైనా కేసులు నమోదయ్యాయి. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా సూరిబాబు అనే వ్యక్తి వ్యవహరించారు. అతడిపై విశాఖ ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సీతమ్మదార ప్రాంతంలో స్వర్ణలత రాత్రి విధుల్లో ఉండగా సూరిబాబు రూ.90 లక్షల విలువైన రూ.2వేల నోట్లతో పట్టుబడ్డాడు. దీంతో స్వర్ణలత సూరిబాబును బెదిరించారు. అందులోంచి రూ.12 లక్షలు తీసుకున్నారని దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ విషయంలో నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు చేపట్టారు. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.