Lokesh: నారా లోకేశ్. టీడీపీలో నెంబర్ 2. చంద్రబాబు తర్వాత అన్నీ అతనే. పార్టీ భవిష్యత్ ఆశాకిరణం ఇతనే. అలాంటి నారా లోకేశ్ను గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడించి గట్టి దెబ్బే కొట్టింది వైసీపీ. ఈసారి కనుక ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేశ్ గెలవకపోతే ఇమేజ్ మరింత డ్యామేజ్. యువగళం పాదయాత్రతో పార్టీ పరపతి, తన పరపతి పెంచేసుకుంటున్నారు నారా లోకేశ్.
లైట్గా గడ్డం పెంచి.. బాడీతో పాటు లాంగ్వేజ్ కూడా మార్చేసి.. పంచ్ డైలాగులతో, మాస్ లుక్తో జనంలోకి జోరుగా వెళుతున్నారు నారా లోకేశ్. తనపై ఉన్న పప్పు ముద్రను.. కష్టపడి కడిగేసుకుంటున్నారు. నారా వారి న్యూలుక్.. లోకేశ్ 2.0 వెర్షన్కు ప్రజల నుంచి మంచి మద్దతే వస్తోంది.
దూసుకుపోతున్న నారా లోకేశ్ మీదకు దమ్మున్న యంగ్ లీడర్ను ప్రయోగిస్తోంది వైసీపీ. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో మాంచి మాస్ ఇమేజ్ ఉన్న.. సీమ బిడ్డ.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో లోకేశ్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. సిద్ధార్థ్ సైతం తనకిచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ.. లోకేశ్పై దండయాత్ర మొదలుపెట్టారు. వరుస ప్రెస్మీట్లతో నారా లోకేశ్ను ఫుల్గా కార్నర్ చేస్తున్నారు.
లోకేశ్ యువగళం స్టార్ట్ అయినప్పటి నుంచీ సిద్ధార్థ్ రెడ్డి పొలిటికల్ యాక్టివిటీ మరింత పెరిగింది. వైసీపీ వ్యూహాత్మకంగా ఆయన్ను ఎంపిక చేసుకుంది. అప్పటికే సోషల్ మీడియాలో కింగ్ అతను. బైరెడ్డి డైలాగులు బాంబుల్లా పేలుతుంటాయి. చాలామంది యూత్కు ఐకాన్ లీడర్. సిద్ధార్థ్ రెడ్డి మాటలను వాట్సాప్ స్టేటస్లుగా, ఇన్స్ట్రా రీల్స్గా పెడుతుంటారు చాలామంది. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని.. జాగ్రత్తగా ఎంపిక చేసి.. శాప్ పదవి ఇచ్చి.. సీమ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుంది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కాగానే.. సిద్ధార్థ్ రెడ్డి యాక్షన్ మొదలైపోయింది. యువగళంలో నారా లోకేశ్ విమర్శలు చేయడం.. వెంటనే సిద్ధార్థ్ రెడ్డి కౌంటర్లు ఇవ్వడం కామన్గా మారిపోయింది. వాళ్లిద్దరి మాటకు మాటలు.. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియానూ షేక్ చేస్తున్నాయి. డైలాగుల పరంగా సిద్ధార్థ్ రెడ్డికి ఎలాగూ ఎడ్జ్ ఉండనే ఉంటుంది. దీంతో.. వారిద్దరినీ కంపేర్ చేసేలా చేసి.. లోకేశ్ ఇమేజ్ను తగ్గించడమే వైసీపీ వ్యూహంగా కనబడుతోంది.
అంతేకాదు.. లేటెస్ట్గా మాజీ మంత్రి కొడాలి నాని మరింత సంచలన విషయం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. అదే నిజమైతే.. అప్పుడు వార్ మరింత మజాగా సాగుతుంది.
నారా లోకేశ్ ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేసే అవకాశం లేకపోలేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండనే ఉన్నారు. ఆర్కేను కాదని మంగళగిరి టికెట్ బైరెడ్డికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అమరావతి సమీప ప్రాంతం కావడంతో.. వైసీపీకి వ్యతిరేక ఫలితం వస్తుందని భావించే ఆర్కేను తప్పించి సిద్ధార్థ్ రెడ్డిని పోటీలో నిలిపేలా వైసీపీ పావులు మారుస్తోందా? సీమ లీడర్ను.. ఆంధ్రాలో దింపితే.. ఓట్లు పడతాయా? లేదంటే, లోకేశ్ను కన్ఫ్యూజ్ చేస్తూ.. ఆయన స్థాయిని సిద్ధార్థ్ రెడ్డి లెవెల్కి తగ్గిస్తూ.. అధికారపార్టీ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతోందా? లోకేశ్ వర్సస్ బైరెడ్డిలా పొలిటికల్ వార్ ఎస్టాబ్లిష్ చేసి.. రాజకీయం రక్తి కట్టిస్తోందా? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి.