Bus shelter : విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని వైసీపీ ప్రభుత్వం కొంతకాలంగా పదే పదే ప్రకటనలు చేస్తోంది. నగరం నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం వైఎస్ జగన్ చాలా వేదికలపై ప్రకటనలు చేశారు. దసరాకు సీఎం వైజాగ్ కు షిఫ్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.
విశాఖకు రాజధాని రూపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వంపై అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మోడ్రన్ బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఆర్టీసీ బస్ షెల్టర్ ను రూ. 40 లక్షలతో నిర్మించింది. ఈ బస్షెల్టర్ను త్వరలో ప్రారంభించాల్సి ఉంది.
ఈ బస్ షెల్టర్ తాజాగా పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ ఖర్చుతో నిర్మించిన బస్ షెల్టర్ కుంగిపోవడంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. షెల్టర్ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆరోపించారు. కుంగిన షెల్టర్ వద్ద ఆందోళన చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.