Bus Accident : అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద అదుపు తప్పింది.
లోయలోకి దూసుకుపోయింది. ఏడు పల్టీలు కొట్టి.. 50 అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.
లోయలో పడిన బస్సు వద్దకు స్థానికులు వెంటనే చేరుకున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బాధితులను అతి కష్టం మీద ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. పాడేరు వైపు నుంచి వచ్చిన మరో ఆర్టీసీ బస్సులో వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలిపోయాయి. రహదారి పక్కన రక్షణ గోడలేదు. ఇదే ప్రమాదానికి కారణమని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్ఫోన్ సిగ్నల్ కూడా సరిగా లేవు. దీంతో ప్రయాణికులు ప్రమాద సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని నిర్దేశించారు.