గుంటూరు, విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా వర్షం కురుస్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తున్నది. అయితే, ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ వాగు వెనక్కి ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యాపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగిపోయింది. మోకాళ్లవరకు వరద నీరు వచ్చి చేరింది. ఇటు ఇళ్లలోకి బుడమేరు వాగు నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత పదేళ్ల క్రిందట కృష్ణానది ఒడ్డు దాటి వచ్చింది కానీ, ఈ విధంగా బుడమేరు వాగు నీరు వెనక్కి ప్రవహించడం ఇదే మొదటిసారి అంటున్నారు స్థానిక ప్రజలు. ఓ వైపు ఆందోళన.. మరోవైపు ఆశ్చర్యంగా ఉందంటున్నారు.
ఇటు బాపట్ల జిల్లా కొల్లూరు ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరవింద వారధి దగ్గర కృష్ణానదికి గండి పడింది. గతంలో కూడా ఇదేమాదిరిగా గండిపడితే ఇసుక సంచులతో కప్పి ఆ గండిని పూడ్చారు. కాగా, ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్న వరద కారణంగా మరోసారి గండి పడింది. దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రాత్రికి వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొల్లూరు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. రేపు ఏపీలో విద్యాసంస్థలకు సెలవు!
ఇదిలా ఉంటే.. ఏపీలో గత రెండురోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు చోట్ల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల బారిన పడి పలువురు దుర్మరణం చెందారు. వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతిచెందారు. కొండచరియలు విరిగి మీదపడడంతో పలువురు మృతిచెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రస్తుతం ఏపీలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎటు చూసినా కూడా వరదనీరే కనిపిస్తున్నది. పలు ప్రాంతాలను వరద పూర్తిగా ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని తమకు భయమేస్తుందంటూ వాపోతున్నారు.
Also Read: మాజీమంత్రి పేర్నినాని కారుపై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం
ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తుంది. సమీక్షలు నిర్వహించి పరిస్థితి తెలుసుకుంటోంది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వారి వారి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇస్తున్నారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. వరద బాధితులను అందులోకి తరలిస్తున్నామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడికక్కడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలను ఈ విపత్తు నుంచి కాపాడటమే ప్రస్తుతం తమ ముందు ఉన్న తక్షణ కర్తవ్యమన్నారు. పలు వరద ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను కూడా ప్రభుత్వం అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇటు పంట నష్టం కూడా భారీగానే జరిగిందన్నరు. ఈ నేపథ్యంలో రైతులను కూడా ఆదుకుంటామని పేర్కొన్నారు.