Btech Ravi : తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్రపన్నారని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. అందుకే తనకున్న ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. గన్ మెన్ ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.
జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తనకు టీడీపీ అవకాశం కల్పించాలని కోరారు. తనకు ఎవరితో శత్రుత్వం లేదన్నారు. కానీ వైఎస్ కుటుంబంతో ఉన్న రాజకీయ శత్రుత్వం వల్లే తనకు ప్రాణహాని ఉందన్నారు.
తనకు ప్రాణహాని జరిగితే అందుకు సీఎం జగన్, ఆయన భార్య వైఎస్ భారతి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను మార్చాలనుకోవడం కాదు.. ముందు నిన్ను నువ్వు మార్చుకో జగన్ అంటూ హితవు పలికారు బీటెక్ రవి.
మరో వైపు జగన్ను తీవ్రంగా విమర్శించారు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు శ్రీనివాస్రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని.. ఇప్పటి వరకు కేవలం 15శాతం మాత్రమే అమలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయకపోగా.. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టులో ఒక్కశాతం పని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.