BRS: కాపులకు రాజ్యాధికారం. దశాబ్దాలుగా వినిపిస్తున్న నినాదం. ఆ స్వప్నం సాకారమయ్యేనా? ఏమో. కాపులే ధీమాగా తాము అధికార పీఠంపై కూర్చుంటామని చెప్పలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చేది ఎవరో డిసైడ్ చేయగల సత్తా ఉన్న కాపులు.. తామే సొంతంగా పవర్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు చిరంజీవి మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఆయన కాడి వదిలేయడంతో నిరుత్సాహ పడ్డారు. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ దూకుడుతో ఈసారి పక్కా ఛాన్స్ అనుకుంటున్నారు. కానీ, ఆయనేమో తాను కుల రాజకీయాలు చేయనని అంటున్నారు. కాపులు మాత్రం పవనే మా లీడర్ అంటున్నారు. మధ్యలో వైసీపీ కాపు పాలిటిక్స్ కాక రేపుతోంది. టీడీపీ తమదే అసలైన బీసీల పార్టీ అంటోంది. ఏపీలో ఇంతటి కాపు కలకలంలో కొత్తగా బీఆర్ఎస్ రూపంలో మరో పొద్దు పొడిచింది. దీంతో, కాపులు మరోసారి కన్ఫూజన్ లో పడ్డారంటున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ కు ఉనికే ఉండదన్నారు. కానీ, ముగ్గురు నలుగురు పేరున్న నాయకులు చేరడంతో అంతా కంగు తిన్నారు. ఏకంగా తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించడంతో మరింత షాక్. ఓ పార్టీకి కాపు నేత అధ్యక్షుడు కావడం ఆ వర్గంలో ఉత్సాహం తీసుకొచ్చింది. జనసేన అధినేతగా పవన్ ఉన్నా.. ఆయనపై కాపు ముద్ర వేయలేం. సో, ఏపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో కాపుల పార్టీగా మారుతుందా? అదే జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఏపీలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీల్లో కాపులకు ఎంత ప్రాధాన్యం లభించినా.. వారు పార్టీ అధ్యక్షులగానో, సీఎం అభ్యర్థిగానో అయ్యే అవకాశమే లేదు. ఆ లెక్కన కాపులకు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్సే.. సో బెటర్ అంటున్నారు. కాపు నాయకుడిని పార్టీ అధ్యక్షునిగా నియమించి.. బలమైన ఓటు బ్యాంకు ఉన్న వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు గులాబీ బాస్. ఎలాగూ ఆయన ఏపీలో సీఎం అయ్యేది లేదు. అందుకే, ముందుముందు తోట చంద్రశేఖర్ నే పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అదే జరిగితే.. కాపులంతా తమ కాపు నేతను సీఎంగా చేసేందుకు జట్టు కడతారా? అధికారంలోకి రాకున్నా.. కాపు ఓట్లను బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చీల్చే ఛాన్స్ ఉంటుందా? ఇదే ఆసక్తికరం.
కాపు ఓట్లను బీఆర్ఎస్ చీల్చితే.. అది నేరుగా జనసేనకే నష్టం అంటున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ తీరుతో విసిగిపోయిన ఆ వర్గం.. ఈసారి పవన్ కల్యాణ్ కోసం జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, మధ్యలో బీఆర్ఎస్ వచ్చి.. తోట చంద్రశేఖర్ ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో మరోసారి పునరాలోచనలో పడిపోయారని తెలుస్తోంది. ఒకవేళ తోటనే సీఎం కేండిడేట్ గా ప్రకటిస్తే.. ఎటువైపు మొగ్గు చూపాలో తెలీని కన్ఫ్యూజన్ లో కాపులు పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలా కాపు ఓట్లు అన్ని పార్టీల మధ్య చీలితే.. అది పరోక్షంగా వైసీపీకే అనుకూలంగా మారుతుందనేది వాస్తవం. అందుకే, జగన్ కు లాభం చేయడం కోసమే.. ఏపీలోకి బీఆర్ఎస్ ను తీసుకొచ్చి.. కాపు నేతను అధ్యక్షుడిగా ప్రకటించారనే ప్రచారం జరుగుతోంది. మరి, ఎన్నికల నాటికి కాపు ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.