YS Vivekananda: మాజీ సీఎం జగన్ ఆస్తులకు సంబంధించి వారి కుటుంబంలో విభేదాలు బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఈ విభేదాలే లక్ష్యంగా సోషల్ మీడియా గత రెండు రోజులుగా కోడై కూస్తోంది. తాజాగా ఇదే విషయంపై జగన్ కూడా స్పందించి, అన్నీ గృహాలలో ఉండే విభేదాలే తమ కుటుంబంలో ఉన్నాయని, వీటిని ఎక్కువగా మీడియాలో చూపిస్తూ టీడీపీ తెగ సంబరపడుతోందని జగన్ విమర్శించారు. అయితే ఇదే విషయానికి సంబంధించో, ఏమో కానీ ఈ అంశానికి తగినట్లుగా, వైఎస్సార్ కుటుంబానికి చెందిన ఓ నేత ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఇంతకు ఆయనెవరో తెలుసా.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి.
ఔను మీరు విన్నది నిజమే. వివేకానందరెడ్డి స్వర్గస్థులైనా కూడా ఆయన ఎక్స్ ఖాతా మాత్రం అలాగే రన్ అవుతోంది. ఇంతకు వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ అనే ట్యాగ్ లైన్ తో పోస్ట్ చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఆ ట్వీట్ లో ఏముందంటే.. డబ్బు మహా పాపిష్టిది, మనిషి చేత ఎంత దారుణమైన చేయిస్తుంది. హెలికాప్టర్లు కూలిపోతాయ్, గుండె పోట్లు వస్తాయ్, కార్ టైర్లు పేలిపోతాయ్, 2022 లో త్రుటిలో తప్పిపోయిందని రాసి ఉంది.
ఇక ఈ ట్వీట్ ఆధారంగా చూస్తే.. లేటెస్ట్ గా మాజీ సీఎం జగన్ ఆస్తులకు సంబంధించి వివాదం రేగుతోంది. తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళలపై కోర్టును ఆశ్రయించారు జగన్. ఇది వారి వ్యక్తిగత అంశం అయినప్పటికీ, మాజీ సీఎంగా, వైసీపీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం పులివెందుల ఎమ్మేల్యే హోదాలో జగన్ ఉండగా, ఏపీ కాంగ్రెస్ అద్యక్షురాలిగా వైఎస్ షర్మిళ ఉండగా ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే తన అన్న కోర్టును ఆశ్రయించడంపై, షర్మిళ రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం సంచలనంగా మారింది. వారి కుటుంబాల మధ్య జరిగిన లేఖల సంభాషణ ఇలా సోషల్ మీడియాలో వైరల్ కాగా, జగన్ కూడా స్పందించారు. టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. తన తల్లి, చెల్లి ఫోటోలను చూపిస్తూ ప్రజలను మోసం చేస్తుందని జగన్ అన్నారు. అందరి ఇంటింటి రామాయణం.. తన ఇంట్లో ఉందని ఇదేమీ కొత్త కాదన్నారు.
ఇలా ఆస్తులకు సంబంధించిన వివాదం రేగిన సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎక్స్ ఖాతా నుండి, డబ్బు దారుణాలకు దారి తీస్తుందని ఎవరిని ఉద్దేశించి అన్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే హెలికాప్టర్లు కూలిపోతాయని ట్వీట్ లో చెప్పడం అసలు దేనికి సంకేతం? అసలు హెలికాప్టర్ కూలి చనిపోయింది ఎవరు? గుండెపోట్లు వస్తాయనగా, వివేకా చనిపోయిన సమయంలో గుండెపోటు అంటూ ముందుగా జోరు ప్రచారం సాగింది. తర్వాత మర్డర్ అనే అంశం తెరమీదికి వచ్చింది. ఇక కార్ టైర్లు పేలిపోతాయ్ అనడం వెనుక.. గతంలో విజయమ్మ కారు టైర్లు పేలిపోగా, ఆ సమయంలో ఎన్నో సందేహాలు వెలుగులోకి వచ్చాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వైఎస్ వివేకా ఆత్మ పేరుతో వచ్చిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. ఇందులోని అంశాలు ఎవరిని ఉద్దేశించినవని అనుకున్నా, ఈ ట్వీట్ వెనుక వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఉండొచ్చన్నది పలువురి నెటిజన్ల అభిప్రాయం. అయితే ఇటీవల సీఎం చంద్రబాబును డాక్టర్ సునీత కలిసి, తన తండ్రి హత్యకు గల కారకులను శిక్షించాలని కోరారు. ఏదిఏమైనా ఈ ట్వీట్ అంతరంగం ఎవరికి ఎరుకో గానీ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.