Boy : కట్టుకున్న టవల్ తోనే కోపంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆ బాలుడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. సవతి తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. అసలు ఏం జరిగిందంటే..?
ఏలూరు కొత్తపేటకు చెందిన సాయి దినేష్కు పదేళ్లు. తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. సాయి దినేష్కు ఓ సోదరి కూడా ఉంది. ఆదివారం సాయి దినేష్ స్నానం చేసి సవతి తల్లిని తెల్ల చొక్కా ఇవ్వమని అడిగాడు. స్నేహితుడి పుట్టినరోజుకు వెళ్లాలని తెలిపాడు. అందుకు ఆమె నిరాకరించింది. బయటకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. మారాం చేస్తుంటే కొట్టింది. దీంతో దినేష్ చొక్కా వేసుకోకుండానే టూటౌన్ పోలీసు స్టేషన్కు వచ్చి సవతితల్లిపై ఫిర్యాదు చేశాడు.
సీఐ చంద్రశేఖరరావు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల మాట వినాలని, చక్కగా చదువుకోవాలని బాలుడికి సూచించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఆ బాలుడిని అప్పగించారు.
గతేడాది అల్లరి చేశాడని సాయి దినేష్కు సవతి తల్లి వాతలు పెట్టిందని అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.