Tirupati : తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని సీఎస్ఎస్ మహాలక్ష్మి గార్డెన్స్ సమీపంలోని వాగులో పడి నిఖిల్ (10) గల్లంతయ్యాడు. బంధువుల కథనం ప్రకారం.. జీవకోనలోని సంతోషమ్మ నగర్కు చెందిన ఆనంద్, చిట్టిల కుమారుడు నిఖిల్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేపల కోసమని మేనమామ ప్రభాకర్ రెడ్డి, తాత, అతని స్నేహితులతో కలిసి మంగళం నుంచి అన్నాసామి పల్లెకు వెళ్లే మార్గంలోని వాగు వద్దకు చేరుకున్నారు.
వాగులో నీటి వేగం ఎక్కువగా ఉండడంతో పిల్లలను వాగుకు దూరంగా ఉండమని అక్కడున్నవారు సూచించారు. కానీ నిఖిల్ మాత్రం గట్టుపైకి వెళ్లినట్టేవెళ్లి తిరిగి వాగులోకి దిగాడు. వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ విషయం నిఖిల్ బంధువులు ఎవ్వరూ గమనించలేదు. కొంత సమయానికి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాలుడు కనిపించలేదు. సమీపంలో చేపలు పడుతున్న కొందరు వ్యక్తులు.. ఎవరో చిన్నపిల్లవాడు నీటిలో కొట్టుకుపోతున్నాడని చెప్పారు.
వెంటనే అప్రమత్తమై చేపలు పడుతున్న వారితో కలసి వాగు పొడువునా గాలించారు. అయినా బాలుడి జాడ కనిపించలేదు. బంధువులు ఫిర్యాదుతో ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న తిరుచానూరు ఎస్ఐ జగన్నాథరెడ్డి స్థానికులతో కలిసి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు సేకరించి పొద్దుపోయేవరకు గాలించారు. ఇదిలా ఉండగా బాలుడి తల్లిదండ్రులు బిడ్డ కోసం తల్లడిల్లిపోయారు. గుండెలు పగిలేలా బోరున విలపిస్తున్నారు.