Botsa : వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. నూతన విద్యా విధానంపై జనసేనాని చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. పవన్ విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బైజూస్ కంటెంట్ కోసం విద్యార్థులు, ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయటం లేదని వివరించారు. ఇదే విషయాన్ని తాము చాలాసార్లు చెప్పామన్నారు బొత్స. కానీ పవన్ కల్యాణ్ కుంభకోణం జరిగిందని విమర్శలు చేయడాన్ని ఖండించారు. పవన్ కు విషయాలు తెలియకపోతే తన వద్దకు రావాలని సూచించారు. ఆ అంశాలపై తాను ట్యూషన్ చెబుతానని సెటైర్లు వేశారు.
విశాఖపట్నం గ్రాండ్వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ విమర్శలపై బొత్స స్పందించారు. అలాగే పార్టీ చేపట్టే కార్యక్రమాలను వెల్లడించారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపడుతున్నామని తెలిపారు. తొలి దశలో 12రోజులపాటు బస్సు యాత్ర కొనసాగుతుందని వివరించారు.
ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకు? అని ప్రశ్నించారు. డబ్బు మదంతో ఉన్న వాళ్లే మద్యం జోలికి వెళ్తారని వ్యాఖ్యానించారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుందన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అక్టోబర్ 26న సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు.