Botsa Satyanarayana Clarity On Hyderabad As A Joint Capital(AP latest news): హైదారాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసిన వైసీపీ ఒక్కరోజులో మాట మార్చింది. కామన్ కాపిటిల్ అంశంపై యూటర్న్ తీసుకుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదని బొత్స తేల్చిచెప్పారు.
పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్నించారు.
అనుభవం ఉన్న నేత ఎవరూ ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని పేర్కొన్నారు.
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని కొనసాగించాలని మంగళవారం మాట్లాడారు. ఏపీకి గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనూ విశాఖపట్నానికి రాజధాని తరలించాలని భావించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరారు. ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తామని వైవీ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశంపై చర్చిస్తామన్నారు.
Read More: తెరపైకి కొత్త ప్రతిపాదన.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ కొత్త డిమాండ్!
వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే స్పందించారు. వైసీపీకి ఆయన వ్యాఖ్యలతో సంబంధంలేదని స్పష్టం చేశారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతంగా తేల్చేశారు. ఇప్పుడు బొత్స కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించి వివరణ ఇచ్చారు. కామన్ కాపిటల్ గా హైదరాబాద్ వైసీపీ పార్టీ విధానం కాదని స్పష్టత నిచ్చారు.
చాలా స్పష్టంగా వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని చెప్పారు. కానీ బొత్స మాత్రం ఆయన అలా అనలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. వైవీ వ్యాఖ్యలను మీడియానే వక్రీకరించిందనే ధోరణిలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాపం వైవీ సుబ్బారెడ్డిని జనమే అపార్థం చేసున్నారా? ఆయన అలా అనలేదా ? అని సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై సెటైర్లు పడుతున్నాయి.