Bonda VS Vangaveeti : విజయవాడ టీడీపీలో ముసలం రాజుకుంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పోరు ఆగడం లేదు. ఇప్పటికే వంగవీటి రాధాను టీడీపీ నమ్మడంలేదంటూ ఉమా వర్గీయులు.. పోస్టులు పెట్టారు. ఐతే దీనికి వంగవీటి రాధా అనుచరులు కౌంటర్ పోస్టులు పెడుతున్నారు.
టీడీపీ వంగవీటిని నమ్మాలంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. పదవి కోసం పార్టిని బెదిరించాలా..? చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా..? దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా? కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోవాలా..? పదవి రాకపోతే కాపుల గొంతు కోశారని పార్టీకి, కులానికి మధ్య విరోధం పెంచాలా..? ఈసారి టికెట్ రాదని అధికార పార్టితో జరపాలా, అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా? అంటూ పోస్టులు పెడుతున్నారు.
వంగవీటి రాధాపై ఏడు పాయింట్లతో ఉమా అనుచరులు పోస్టులు పెడితే పదిహేడు పాయింట్లతో ఉమాపై పోస్టులు పెడుతున్నారు రాధా వర్గీయులు. ఇలా పోటాపోటీ పోస్టులతో టీడీపీలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ నెలఖారున టీడీపీ ప్రకటించే మొదటి లిస్టులో వంగవీటి రాధా పేరు ఉంటుందని రాధా వర్గం ప్రచారం చేసుకుంటోంది. మరి ఈ ఇద్దరిలో టీడీపీ అధిష్ఠానం సెంట్రల్ సీటును ఎవరికి కట్టబెడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడక తప్పదు.