Road Accident: కొత్తసంవత్సరం అంతా బాగుండాలని, ఎలాంటి విషాదాలు వద్దని ఎంత కోరుకున్నా.. కొన్ని సంఘటనలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో.. మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఎస్సై నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ఎదురుగా గిద్దలూరు నుంచి వస్తున్న బొలెరో వాహనం బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.