BJP TDP Janasena Alliance : టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ సుముఖంగానే ఉందా? పొత్తులపై కాషాయ పార్టీ నేతల వాయిస్ మారుతోందా? అంటే అవును అనే సమాధానం వస్తోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీడీపీతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరించారు. జనసేన ఒక్కటే తమ మిత్రపక్షమని పదేపదే ప్రకటనలు చేశారు. అయితే పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యాక సీన్ క్రమక్రమంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. గతంలా కాకుండా పొత్తులపై అధినాయకత్వంతో చర్చించుకోవాలంటున్న రాష్ట్ర బీజేపీ నేతలు మరి ఆ పొత్తుల లెక్కలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో కాని. సీట్ల పంపకాలపై అప్పుడే లెక్కలు మొదలైపోవడం విశేషం.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి జరిగిన 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. అప్పట్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నా . జనసేనాని పవన్కళ్యాణ్ మాత్రం కూటమి విజయానికి విస్తృత ప్రచారం చేశారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఆ కూటమి విజయం సాధించడంతో టీడీపీ, బీజేపీలు ప్రభుత్వాల్లో కూడా భాగస్వాములయ్యాయి.
2019 ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే, జనసేన – బీజేపీలు కలిసి పోటీలోకి దిగి రాష్ట్రంలో ఘోర పరాజయం పాలయ్యాయి. అందుకే ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఉండటానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలంటున్నారు జనసేన అధినేత.
ఆ క్రమంలో జనసేన, టీడీపీల పొత్తు కూడా ఖరారైంది. జనసేన తన మిత్రపక్షం అంటున్న బీజేపీ మాత్రం పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే టిడిపి జనసేన పొత్తులు ఖరారు చేసుకుని 2024 ఎన్నికలలో బీజేపీ కూడా కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాయి. ఆ క్రమంలో రాష్ట్ర బిజెపి పొత్తుల విషయాన్ని అధినాయకత్వానికి వదిలివేస్తూ పొత్తు కుదుర్చుకోవడానికి అధినాయకత్వంతో మాట్లాడుకోవాలని తాజాగా స్పష్టం చేసింది. దాంతో పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ సుముఖంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక వేళ పొత్తు కుదిరితే సీట్ల పంపకం ఎలా అన్న చర్చలు కూడా మొదలైపోయాయి.
2014లో అయితే టిడిపి, బిజెపిలు మాత్రమే సీట్లు పంచుకున్నాయి. ఈసారి జనసేన కూడా పోటీలో ఉండటంతో ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలన్న చర్చ మొదలైంది.పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తుంది. అయితే జనసేన 35 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ టీడీపీ ఇస్తానంటున్న సంఖ్యకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక పొత్తుపై క్లారిటీ వస్తే బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలు అడగాలని భావిస్తోందంట. అంత సీన్ లేదని గతంలోలా రెండు పార్లమెంటు, 6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద పొత్తులపై బీజేపీ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి