Vidadala Rajini : ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కూడా హాజరయ్యారు. అయితే వేదికపై ఆమె ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ నేతలు అడ్డుతగిలారు.
కేంద్రం నిధులతో కార్యక్రమాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పుకుంటున్నారేంటంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పేరు చెప్పకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహించారు. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. బీజేపీ నేతల రియాక్షన్తో షాకైన మంత్రి రజని.. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. తిరిగి వేదికపై తన సీటులో కూర్చున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమ ఆవేదనను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీజేపీ నేతలను కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వారించారు.
అదేసమయంలో ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు కల్పించుకున్నారు. ఈ అభ్యంతరాలను కేంద్రమంత్రికి చెప్పానంటూ బీజేపీ నేతలకు సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.