BJP AP chief purandeswari latest news(AP politics): బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో 11 మంది నేతలు శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిశారు. అనంతరం ఆయనకు 13 అంశాలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం తాకట్టుపెట్టిన ఆస్తుల వివరాలు, గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలతోపాటు పలు వివరాలను ప్రకటించాలని కోరుతూ వారు వినతిపత్రం అందజేశారు.
గవర్నర్ నజీర్ తో భేటీ తరువాత పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు చేసిందని ఆమె ఆరోపించారు. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచులు, గుత్తేదారులకు బిల్లులు కూడా ఇవ్వలేదంటూ ఆమె పేర్కొన్నారు. చివరకు, కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను కూడా ఏపీ ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆమె ఆరోపించారు.
అంతేకాదు.. మద్యంపై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని వివరణ కోరే హక్కు గవర్నర్ కు ఉందంటూ ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల వివరాలు కావాలని కోరినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత కూడా నచ్చినవారికి ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఏపీలో భారీగా పెరిగిన ఉప్పు ధర.. కారణం ఇదే..?
కాగా, ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. 25 పార్లమెంటు స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే, పోలింగ్ రోజు, ఆ తరువాత ఏపీలో పలు చోట్లా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు ఏపీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.