BJP Leader Murder in Kurnool(AP news today telugu) : కర్నూల్ జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఆదోని మండలం పెద్దహరివాణంలో బీజేపీ నేత శేఖన్న(50)ను కొంతమంది దుండుగులు దారుణంగా హత్య చేశారు. ఆయన ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసి చంపారు. ఉదయం రక్తమడుగులో పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే శేఖన్న ఇటీవల వైసీపీ వీడి ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ విషయంపై ఆదోని డీఎస్పీ సోమన్న, తాలుకా సీఐ నల్లప్ప, ఐఎస్వీఐ ఎస్ఐ నాగేంద్ర ఆరా తీస్తున్నారు.
ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు శేఖన్నకు గ్రామంలో ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు.
Also Read: జగన్కు మరిన్ని కష్టాలు.. మెడకు లిక్కర్ స్కామ్.. వాసుదేవరెడ్డి అరెస్ట్!
ఇదిలా ఉండగా, కర్నూల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఆరు హత్యలు జరగగా.. ఇందులో నలుగురు టీడీపీ చెందిన వారు ఉన్నారు. మిగతా ఇద్దరిలో ఒకరు వైసీపీ, మరొకరు బీజీపీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. వెల్దుర్తి, డోన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ప్రాంతాల్లో టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు. మహానందిలో వైసీపీ కార్యకర్త హత్యకు గురవ్వగా.. తాజాగా, ఆదోనిలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు.