Bjp-Janasena Alliance: రాజకీయాల్లో.. అయితే దోస్తి.. లేదంటే దుష్మనీ. ఇది అందరికి తెలిసిందే. కానీ అసలు దోస్తులా? దుష్మన్లా? అన్నది తేలని విచిత్రమైన పరిస్థితి ఉందంటే అది ఏపీ బీజేపీదే అని చెప్పాలి. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉందా? లేదా? అన్న చిన్న ప్రశ్నకు కూడా కమలనాథుల నోటి నుంచి సరైన జవాబు రావడం లేదు. కీలక భేటీలు.. ముఖ్య నేతల సమావేశాల్లో తలలు బాదుకుంటున్నా అదే పరిస్థితి. ఇంతకీ టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ ఉందా? లేదా? అసలు బీజేపీ నేతల మదిలో ఏముంది?. అయితే బీజేపీ పొత్తుపై మాత్రం.. టీడీపీ ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ లేదు. యువగళం సభలోనూ చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం వాళ్లే పొత్తు కావాలని అడిగితే సరిపోతుంది కదా అంటూ బీజేపీ తలా తోక లేని సమాధానం చెబుతోంది. బీజేపీ దోస్తీ పిలుపుపై తెలుగుదేశం ఇంతవరకూ స్పందించలేదు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా పొత్తుపై మాట్లాడటం లేదు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
ఓ వైపు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడిగా సభలు, సమావేశాలతో పాటు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నా బీజేపీది మాత్రం ప్రేక్షకపాత్రే. ఈ అంశంపై తేల్చేందుకు బెజవాడలో కీలక సమావేశం నిర్వహించారు బీజేపీ నేతలు. కేంద్ర నేతలు కూడా హాజరైన ఈ భేటీలో కూడా పొత్తులకు సంబంధించి ఏం తేల్చలేదు నేతలు. ఇప్పటికీ కూడా పొత్తులకు సంబంధించి బీజేపీ నేతల వద్ద సరైన సమాధానం లేదు. కేంద్ర నాయకత్వమే పొత్తుల అంశాన్ని తేలుస్తుందంటున్నారు. పొత్తుపై మాట్లాడాల్సింది తాము మాత్రమే కాదు.. జనసేన అధ్యక్షుడు పవన్కు కూడా బాధ్యత ఉండక్కర్లేదా అని నిలదీస్తున్నారు. ఒక్క జనసేననే కాదు.. పొత్తు అంశంపై టీడీపీ కూడా నోరు విప్పాలంటున్నారు బీజేపీ నేతలు.
ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు బీజేపీ నేతల భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే బెటరా? పొత్తులతో బెటరా? అన్న దానిపై హాట్ హాట్ డిబెట్ జరిగినట్టు తెలుస్తోంది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఓట్లు బాగానే వస్తాయి కానీ.. సీట్లు వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేదని తేల్చేశారు. బీజేపీ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్తో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తు అంశంపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీ సాధారణమైనదే అని.. జనసేన తమ మిత్ర పక్షమే అని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి చెబుతున్నారు.
ఇప్పటికే సీట్ల సర్దుబాటులో టీడీపీ-జనసేన క్లారిటీతో ఉన్నారు. ఆలస్యమైతే బీజేపీకి కేటాయించే సీట్ల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఒంటరిగా వెళ్తే పార్టీ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న భయం కమలనాథుల్లో ఉంది.
.
.