BJP High Command Shock to Andhra Pradesh Leader: బీజేపీ హైకమాండ్.. ఏపీ బీజేపీ నేతలకు షాకిచ్చిందా? మోదీ 3.0 కేబినెట్ లో సీనియర్లను పక్కన పెట్టిందా? యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఎందుకు పక్కన పెట్టింది? కేబినెట్ కూర్పు వెనుక ఏం జరిగింది? లాబీయింగ్ జరిగిందా? వైసీపీ మద్దతుగా ఉండే కొందరు బీజేపీ నేతలు వెనుక నుంచి చక్రం తిప్పారా? ఆమెకి మంత్రి పదవి రాకుండా అడ్డుకట్ట వేశారా? బీజేపీ పెద్దలకు తన పని తనం నచ్చిందని చెప్పుకుంటున్న సీఎం రమేష్కు మోదీ కేబినెట్లో కనీసం ఆయన పేరు ప్రస్తావన ఎందుకు రాలేదు? ఏపీలో రాజకీయాల్లో ఈ నేతలిద్దరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు.
కేంద్ర మంత్రి పదవుల్లో సీనియర్లకు జాతీయ నాయకత్వం ఫస్ట్ ప్రయార్టీ ఇస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాల అధ్యక్షులకు తొలి ఛాయిస్ ఉంటుంది. ఇటు యూపీఏ గానీ, ఎన్డీయే వాళ్లకే ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఈసారి ఏపీలో సీన్ రివర్స్ అయ్యింది. కూటమి తరపున బీజేపీ పోటీ చేసిన ఆరు సీట్లకుగాను ముగ్గురు మాత్రమే గెలిచారు. అందులో ఇద్దరు సీనియర్లు పురందేశ్వరి, సీఎం రమేష్. మరొకరు ఎంపీగా గెలిచిన శ్రీనివాసవర్మ తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్నారు.
రాజమండ్రి నుంచి భారీ మెజార్టీతో గెలిచారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఈసారి మోదీ కేబినెట్ లో ఆమెకు మంత్రి పదవి వస్తుందని ఆమె మద్దతుదారులు భావించారు. ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారామె. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడడానికి పురందేశ్వరి, సీఎం రమేష్ తమ వంతు కృషి చేశారు. ఈసారి ఏపీ నుంచి బీజేపీ తరపున ఇద్దరికి ఛాన్స్ వస్తుందని నేతలే కాదు చివరకు ఆ పార్టీ కార్యకర్తలు అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల ఆశలను వమ్ము చేసింది బీజేపీ హైకమాండ్.
Also Read: వైసీపీపై ఆపరేషన్ లోటస్ ఇలా.. టార్గెట్ ఆ నేతలే..!
బీజేపీ హైకమాండ్ మాత్రం కేవలం ఒక్క పదవితోనే సరిపెట్టింది. మరో ఇద్దరికి మొండిచేయి చూపింది. అయితే పురందేశ్వరికి మోదీ కేబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడం వెనుక పార్టీలో మరో వర్గం కారణమనే చర్చ జోరుగా సాగుతోంది. సీట్లు ఎంపిక విషయంలో వాళ్లకు నచ్చినట్టే జరిగిందని, అందులో చాలామంది గెలిచారు.. మరికొందరు ఓడిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ బీజేపీలోని మరోవర్గం బీజేపీ పెద్దలతో మంత్రాంగం నడిపిందని ఏపీ బీజేపీ కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకోవడం మొదలైంది.
ఈ వాదనను తోసిపుచ్చినవాళ్లు లేకపోలేదు. రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో తొలుత ఆయా రాష్ట్రాలకు ప్రయార్టీ ఇచ్చిందని అంటున్నారు. ఆ ఎన్నికల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో సీనియర్లుకు ప్రాధాన్యత ఇవ్వడం ఖాయమని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.