Andhra BJP news(AP political news) : ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కాషాయ పెద్దలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తైన వేళ దేశవ్యాప్తంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు శ్రీకాళహస్తిలోనూ భారీ సభలో ఇవే అంశాలపై నడ్డా ప్రసంగించనున్నారు. ఈ సభకు ఏపీ బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తిలో కేంద్రం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను జేపీ నడ్డా వివరిస్తారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన జాతీయ రహదారులు, నడికుడి రైల్వేమార్గం లాంటి పనుల పురోగతిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పార్టీ నేతలతో సమావేశమై.. రాష్ట్రంలో తాజా రాజకీయాలపైనా చర్చిస్తారు.
మరోవైపు ఆదివారం విశాఖలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభా ప్రాంగణం వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా చర్యలను నగర పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా విశాఖకు అమిత్ షా వస్తారు. రాత్రి 7 గంటలకు రైల్వే గ్రౌండ్స్లో బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి విశాఖలోనే బస చేస్తారు.