BIG Shock To Kesineni Nani : బెజవాడలో కేశినేని సోదరుల వివాదానికి పార్టీ పరంగా పరిష్కారం దొరికినట్లైంది. వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి బెజవాడ ఎంపీ టికెట్ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. అలా గత కొంత కాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఫుల్స్టాప్ పెట్టారు. ఏపీకి పొలిటికల్ క్యాపిటల్ అయిన బెజవాడలో కేశినేని బ్రదర్స్ నాని, చిన్నిల మధ్య పొలిటికల్ వార్ పార్టీకి తలనొప్పిగా మారింది. వారి ఆధిపత్యపోరు పార్టీకి, అధిష్ఠానానికీ కూడా ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలో నానికి టీడీపీ బాస్ చెక్ పెట్టారు. ఇక ఇప్పుడు బెజవాడ ఎంపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. బెజవాడ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం చేరవేసింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానంటున్నారు.
2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ఆయన సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయడమే కాకుండా వివిధ సందర్భాల్లో అధిష్టానంపై కూడా ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. అప్పట్లో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. అదే తరుణంలో ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. అన్నకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టిన చిన్నీకి బుద్దా వెంకన్న వంటి నేతలు మద్దతుగా నిలుస్తూ వచ్చారు.
ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతం కావడానికి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కేశినేని నాని, ఆయన అనుచరులు ఉద్దేశ పూర్వకంగా విధ్వంసానికి పాల్పడినట్టు టీడీపీ అధిష్టానం భావించింది. ప్రధానంగా తన తమ్ముడు కేశినేని చిన్ని టీడీపీలో యాక్టీవ్ కావడాన్ని నాని జీర్ణించుకోలేకపోతున్నారు. తిరువూరు సభ విజయవంతానికి నిర్వహిస్తున్న సమావేశానికి ఏ హోదాలో చిన్ని వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిరువూరు టీడీపీ ఇన్చార్జ్పై నోరు పారేసుకోవడం, కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. నాలుగేళ్లుగా కేశినేని నాని వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేసిన చంద్రబాబు. ఇక ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని భావించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ ఎంపీని టీడీపీ బాధ్యతల నుంచి తప్పించడానికి నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీనేతలతో కేశినేనికి చేరవేశారు. తిరువూరు సభ ఏర్పాట్ల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు నానికి అందాయి. ఆ విషయాన్ని కేశినేని నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో విజయవాడలో కేశినేని నాని బ్రదర్స్ పోలిటికల్ వార్ కు తెరపడినట్టేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. ఇలా ఉండగా తిరువూరు సభ బాధ్యతలను కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించారంటున్నారు. అలాగే విజయవాడ ఎంపీ టికెట్ను కేశినేని చిన్నికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చిన్నికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాని మద్దతు ఇవ్వరు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని గతంలో కేశినేని ప్రకటించారు. ఆ క్రమంలో బెజవాడ ఎంపీ టికెట్పై టీడీపీ పాలిటిక్స్ ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.
.
.