AP: 151 మంది ఎమ్మెల్యేలతో బాహుబలిలా కనిపించారు జగన్. మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం జై కొట్టడంతో వచ్చే ఎన్నికల్లోనూ జైత్రయాత్రే అనుకున్నారు. వై నాట్ 175? అంటూ ధీమాతో దూకుడు పెంచారు. నాలుగేళ్లు అధికార పార్టీకి అంతా స్మూత్గానే నడిచింది. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్ జరిగింది. కీలకమైన ఎన్నికల ఏడాదిలో మాత్రం ఊహించని షాక్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ మీద దెబ్బ. పట్టభద్రుల స్థానాల్లో మూడిటికి మూడూ ఓడిపోయారు. ఎమ్మెల్యేల కోటాలో బలం ఉన్నా ఓ సీటు మిస్ అయ్యారు. ఏం జరుగుతోంది? వైసీపీకి ఇంతటి భారీ పరాజయాలకు కారణమేంటి?
ఏ మాయ చేసిందో గానీ.. టీడీపీ అనూహ్యంగా వరుస విజయాలు కైవసం చేసుకుంది. వైసీపీకి వెన్నుముకలాంటి రాయలసీమలో రెండు ఎమ్మెల్సీలను గెలుచుకుంది. కుప్పంను టార్గెట్ చేసిన జగన్కు పులివెందులలోనే సవాల్ విసిరింది. అటు, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ ఊదరగొడుతున్న ఉత్తరాంధ్రలోనూ పసుపు జెండా ఎగిరింది. ఇవేవీ మామూలు ఫలితాలు కావు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన రాజకీయ సంచలనాలు.
అభ్యర్థులు బలమైన వారా? కేండిడేట్స్ని చూసే ఓటేశారా? అంటే పూర్తిగా వారివల్లే గెలిచినట్టు చెప్పలేం. పోనీ చంద్రబాబు వ్యూహాలు బ్రహ్మాండంగా పని చేశాయా అంటే.. బాబు స్ట్రాటజీ వర్కవుట్ అయి ఉండొచ్చు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీగా చిరంజీవిరావు ఎంపిక బాగా పని చేసింది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లో టెక్నికల్గా బలం లేకున్నా.. అభ్యర్థిని బరిలో దింపి తన రాజకీయ మేధస్సును ప్రయోగించారనే చెబుతున్నారు. అనురాధను పోటీలో ఉంచి.. నెంబర్ గేమ్ స్టార్ట్ చేశారు. వైసీపీని బాగా కంగారు పెట్టారు. చంద్రబాబు వ్యూహానికి అధికార పార్టీ ఖంగుతింది. ఎమ్మెల్యేలతో క్యాంపులు నిర్వహించింది. అనేక మందిపై నిఘా పెట్టింది. లాస్ట్ మినిట్ వరకూ భయం భయంగానే ఉంది.
వైసీపీ భయమే నిజమైంది. చంద్రబాబు వ్యూహం పని చేసింది. ఎమ్మెల్యేల కోటాలోనూ టీడీపీ ఓ సీటు కొల్లగొట్టింది. మొత్తంగా నలుగురు ఎమ్మెల్సీలతో జగన్కు ఊహించని షాకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది మామూలు విజయం కాదు. సైకిల్కు రెక్కలొచ్చినట్టే. ఫ్యాన్ రెక్కలు వీక్ అయినట్టే.
విపక్షం నుంచి అధికారపక్షానికి వలసలు ఉండటం కామనే. 23 మందిలో ఓ నలుగురు ఎమ్మెల్యేలను తమ ఖాతాలో కలిపేసుకుంది వైసీపీ. కానీ, అనూహ్యంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ ఆకర్షించడం మాత్రం సంచలనమే. ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డిలు టీడీపీకి మద్దతుదారులుగా మారడం జగన్కు ఝలకే. తాజా ఎమ్మెల్సీ ఎన్నికతో ఇద్దరు కాదు.. మరో ఇద్దరు ఇంటిదొంగలు ఉన్నారంటూ వైసీపీ కంగారుపడుతోంది. కొందరిని అనుమానిస్తూ.. వారి పేర్లు ప్రచారంలో ఉంచింది. ఇదంతా చంద్రబాబు కుయుక్తులు అని.. ఇలాంటి విషయాల్లో ఆయన ఎక్స్పర్ట్ అంటూ ఎదురుదాడి మొదలెట్టేసింది. చేతులు కాలాక.. ఇప్పుడు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా ఏం లాభం? ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
వైసీపీకే ఏదో తేడా కొట్టింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే భయంతో.. కొంతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నెంబర్ 16 అంటూ చంద్రబాబు సైతం వైసీపీ భయాన్ని మరింత ఎగదోస్తున్నారు. మైండ్గేమ్తో జగన్ ధీమాను చెదరగొడుతున్నారు.
ఇక గ్రాడ్యుయేట్స్ కేటగిరిలో క్లీన్ స్వీప్ అవడం జగన్ను ఆలోచనలో పడేసే విషయమే. ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై రగిలిపోతున్నారనే విషయం తేలిపోయింది. అందుకే వెండి కాయిన్లు ఇచ్చినా ఓటర్ల నుంచి వెక్కిరింతే మిగిలింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా.. ప్రజలు మెచ్చకపోవడం పార్టీని పునరాలోచనలో పడేసింది. పీఆర్సీపై అసంతృప్తి, డీఏలు, సీపీఎస్ రద్దుపై ఉద్యోగులు యాంటీగా మారారు. గతుకుల రోడ్లు, అధికార పార్టీ అరాచకాలు లాంటివి మరో మైనస్. టీడీపీకి పరోక్షంగా జనసేన సహకరించడమూ వైసీపీకి నెగటివ్. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు.. నాలుగు ఎమ్మెల్సీలు ఓడిపోవడం జగన్కు అగ్నిపరీక్షే పెట్టింది. ఇకనుంచి జగన్ వ్యూహం మారుస్తారా? చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో దూకుడు పెంచుతారా? మధ్యలో పవన్ కల్యాణ్ స్ట్రాటజీ ఏంటి? అనేది రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రభావం చూపే అంశాలు. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు ఈ విజయాలను ఎంజాయ్ చేస్తుంటే.. వైసీపీ మాత్రం ఓటమిపై పోస్ట్మార్టం మొదలుపెట్టింది.