అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఊరట ఇచ్చే అంశం అయినా.. వాట్ నెక్ట్స్ అనే చర్చ సాగుతోంది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవటంతో వైసీపీకి ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ జగన్… స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి లేఖ రాయటంతో పాటు న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. అయినా ఆయనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. తగిన సంఖ్యాబలం లేకపోవటంతో వైసీపీ అధినేత జగన్.. అసెంబ్లీలోకి రావటానికి కూడా ఇబ్బంది పడుతున్నారంటూ టాక్ నడుస్తోంది. అందుకే సమావేశాల సమయంలో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని తప్పించుకుంటున్నారనే వాదనలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణపై గురుతర బాధ్యత ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… సీనియర్నేతగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఉత్తరాంధ్రలో మంచి గ్రిప్ ఉన్న నేతగా సత్తిబాబుకు పేరుంది. దీంతో పాటు ప్రత్యర్థులకు తనదైన శైలిలో సమాధానం చెప్పగలిగే సత్తా కూడా ఉంది. అయితే… శాసనమండలిలో ఆయన వైసీపీ తరుపున ఎలాంటి వాదన వినిపించనున్నారనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో ఎలాగూ సంఖ్యాబలం లేదు. అక్కడ అధినేత జగన్కు ప్రతిపక్షహోదా లేకపోవటంతో సాధారణ సభ్యునిగా మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీకి బొత్స ఎంపిక కాస్త ఊరట ఇచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు.. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. ఆయన స్థానంలో అప్పిరెడ్డిని వైసీపీ ఎన్నుకుంది. అప్పిరెడ్డిని మండలిలో ప్రతిపక్ష నేతగా గుర్తించిన ప్రభుత్వం.. ఆయనకు అన్ని సదుపాయాలనూ కల్పించింది. కానీ.. అసెంబ్లీలో మాత్రం జగన్కు ఆ అవకాశం దక్కనేలేదు. గతంలోనూ వైసీపీ హయాంలో రెడ్డి కులస్థుల హవా కొనసాగిందనే ఆరోపణలున్నాయి. అసెంబ్లీలో జగన్ అన్నీ తానై వ్యవహరించగా.. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్సభలో మిథున్రెడ్డిని ఎంపిక చేశారు. తాజాగా లేళ్ల అప్పిరెడ్డికి మండలిలో ప్రతిపక్షహోదా దక్కింది. ఈ నేపథ్యంలో వైసీపీలో రెడ్డీల హవా కొనసాగుతుందనే వాదనలకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చేలా మారాయి.
ఈ నేపథ్యంలో వైసీపీలో అన్నివర్గాలకూ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్… అప్పిరెడ్డి స్థానంలో ప్రతిపక్షనేతగా బొత్సకు అవకాశం ఇస్తారనే టాక్ నడుస్తోంది. అలా చేస్తే పార్టీలో సామాజిక న్యాయం చేసినట్లు అవుతుందనే భావనలో వైసీపీ ఉందని సమాచారం. అదే జరిగితే… మాజీ సీఎం జగన్కన్నా… బొత్సకు ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అన్ని చోట్లా రెడ్డి కులస్థులే ఉన్నారనే అపవాదును తొలగించుకునేందుకు వైసీసీ అధినేత.. కొత్తవ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అప్పిరెడ్డి.. ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read: రామానాయుడి స్టూడియో భూములపై.. చంద్రబాబు సంచలన నిర్ణయం
వైసీపీ సభ్యులు లేకపోయే సరికి.. అటు అసెంబ్లీ.. ఇటు మండలిలో కూటమి సర్కారు హవా నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలు.. చేసిన ఘనకార్యాలనూ కూటమి ప్రజల ముందు ఉంచుతుంది. సీఎం చంద్రబాబు అయితే.. గత ప్రభుత్వ హయంలో జరిగిన నష్టాన్ని ప్రజెంటేషన్ల రూపంలో ఏకంగా అసెంబ్లీలోనూ వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఉంటే వాటిపై కచ్చితంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ప్రతిపక్షహోదా లేనప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూనే.. ఆయన తన వాణిని వినిపించాలి. అది పూర్తిస్థాయిలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ.. మండలిలో వైసీపీకి ప్రతిపక్షహోదా లభించటంతో ఆ స్థానాన్ని బొత్సకు కట్టబెట్టాలనే యోచనలో వైసీపీ ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
కాబట్టి .. గత ప్రభుత్వంలో జరిగిన అవకవతకలపై చర్చ సాగితే మండలిలో ఉన్న బొత్స సమాధానం చెబుతూనే.. తిరిగి కౌంటర్లు వేసేందుకు అవకాశం లభించనుంది. మండలిలో వైసీపీ గొంతు వినిపించే బాధ్యతను బొత్స సత్తిబాబు తీసుకోనున్నారు. అదే జరిగితే.. జగన్కు కూడా దక్కని గౌరవం బొత్స సత్యనారాయణకు దక్కుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది జగన్కు కాస్త ఇబ్బందికరమైనా.. ఉన్న పరిస్థితుల్లో ఇంతకుమించిన వేరే ఆప్షన్.. వైసీకీ లేదని రాజకీయవర్గాలు చెబుతున్నారు
ఇప్పటివరకూ ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. PCC చీఫ్గా పనిచేసిన బొత్స సత్యనారాయణ.. తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి.. ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన వ్యక్తిగా… కూటమి ప్రభుత్వం చేసే ఆరోపణలపై సమాధానం చెబుతూనే ప్రభుత్వ తీరుపై ప్రశ్నించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పాత్ర కీలకంగా మారనుందని.. అది జగన్ కంటే ఎక్కువగానే ఉండబోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.