Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో ఉత్కంఠ మరింత పెరిగింది. వివేకా హత్యలో ఆయన పాత్ర ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. భాస్కర్రెడ్డిపై సీబీఐ పలు అభియోగాలు, ఆరోపణలు నమోదు చేసింది.
వివేకా హత్య జరిగిన రోజు అంటే 2019 మార్చి 15న తొలుత గుండెపోటుగా ప్రచారం చేయడం, సాక్ష్యాలు చెరిపివేయడంలో భాస్కర్రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా ఆయనను పేర్కొంది. హత్యకు ముందురోజు అంటే 2019 మార్చి 14న సాయంత్రం 6.14 గంటల నుంచి 6.31 గంటల వరకు నిందితుడు సునీల్ యాదవ్.. భాస్కర్రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. గూగుల్ టేక్ అవుట్ ద్వారా అతడిని గుర్తించినట్లు సీబీఐ తెలిపింది.
మరో నిందితుడు దస్తగిరి కదిరి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ వేచి చూశారని సీబీఐ పేర్కొంది. ఆ సమయంలో తన రెండు ఫోన్లను భాస్కర్రెడ్డి స్విచ్ఛాఫ్ చేశారని తేల్చింది. వివేకానందరెడ్డి 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత భాస్కర్రెడ్డి ఇంటికి వివేకా వెళ్లారని.. తండ్రీకొడుకులతోపాటు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సీబీఐ నిర్ధారించింది. వివేకా వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భాస్కర్రెడ్డి భావించారని అందుకే అడ్డుతొలగించుకునేందుకే శివశంకర్రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించి ఉంటారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ అభియోగాల నేపథ్యంలో భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేత బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డి చిన్న చేపలు మాత్రమేనని.. తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద చేపలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేస్తున్న పోరాటానికి కొంత న్యాయం జరిగినట్లు అనిపించిందని తెలిపారు.
టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు వివేకా హత్య వెనుక ఇంకా ఎవరైనా పెద్దల హస్తం ఉందా..? సీబీఐ నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలనాలు చోటుచేసుకుంటాయి..? ఇలాంటి అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.