Bank Account : వినియోగదారుడి ప్రమేయం లేకుండా నకిలీ వేలిముద్రల సాయంతో, ఆధార్ కార్డు ఎనేబుల్ చేసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ వేలిముద్రల తయారీ పరికరాలను సీజ్ చేశారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వేంకటేశు, అజయ్, కళ్యాణ్, షేక్ జానీ, గోపిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశంలోని పలు రాష్ట్రాలలో సుమారు 416 AEPS నేరాలు చేసినట్లు విచారణలో తేలినట్లు జిల్లా ఎస్పి అన్బు రాజన్ వివరించారు.
సైబర్ నేరగాళ్ల వ్యవహారంపై సాంకేతికంగా నిఘా ఉంచడంతో గుంటూరు యూనియన్ బ్యాంక్ నుంచి డేటా సేకరించి, నిందితులు గుంటూరు జిల్లా నుంచి పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. వీరి బ్యాంకు ఖాతాల ద్వారా 5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు విచారంలో తేలింది.
తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా వేలిముద్రలు, ఆధార్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం నిందితుల దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఖాతాల్లో నగదు పోయిన బాధితులంతా ఫిర్యాదు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచించారు.