BCY Chief Promises To Donate 1000 Cows To TTD: తిరుమలలో లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా, తిరుమల ప్రసాదాల తయారీకి నెయ్యి పరిష్కారం కోసం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ కీలక ప్రకటన చేశారు. తిరుమలలో సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబును రామచంద్రయాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాను వెయ్యి గోవులను ఇస్తానని లేఖలో పేర్కొన్నారు.
అవసరమైతే మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూరుస్తానని రామచంద్రయాదవ్ చెప్పారు. వీటితో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇందులో నుంచి కనీసం 50వేల కేజీల వెన్న తీసి 30వేల కేజీల నెయ్యి తయారుచేయొచ్చని పేర్కొన్నారు. మిగిలిన మొత్తం రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపించి, కల్తీ నెయ్యి సమస్యను నివారించవచ్చని తెలిపారు.
Also Read: ఆరు నెలల కాకుండానే యుద్ధం చేస్తారా..? జగన్ ఏంటిది?
ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి దర్శనాన్ని రోజుకు సగటున సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుంటున్నారు. దీంతో దాదాపు రూ.5 కోట్ల ఆదాయం వస్తుండగా.. తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటు చేయలేమని లేఖలో రామచంద్రయాదవ్ ప్రశ్నించారు. పవిత్రత కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదని ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని కల్తీ నెయ్యిని అరికట్టాలని సూచించారు.