Balineni Srinivas Reddy : ఒంగోలులో పోలీసుల తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. పంతం నెగ్గించుకున్నారు. ఓ కేసు విషయంలో పోలీసుల తీరును నిరసిస్తూ.. గురువారం నుంచి సీఎంవోలోనే ఉన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. ఎస్పీ మల్లిక ఘర్గ్ను తాడేపల్లి రావాలని ఆదేశించింది. నకిలీ స్టాంప్స్ కేసుల్లో పోలీసుల తీరును నిరసిస్తూ .. బాలినేని తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. గురువారం సీఎంను కలవాలని యత్నించినా..తొలుత సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. జగన్ ఎమ్మిగనూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో బాలినేని.. ఆయన్ను కలవడం కుదరలేదు. సీఎం ఆదేశాల మేరకు.. ధనుంజయ్ రెడ్డిని కలవాలని సీఎం ఆదేశించగా.. ఆయన్ను కలసి తాజా పరిస్థితులను వివరించారు.
కొన్నిరోజులుగా తన మాటకు విలువలేదంటూ బాలినేని అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో.. జిల్లా ఎస్పీకి పిలుపురావటంతో మల్లికఘర్గ్ తాడేపల్లి చేరుకున్నారు. దీంతో ఇరువురితో సీఎంవో కార్యాలయం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ అపాయింట్ మెంట్ నిరాకరించడంతో అధిష్టానం ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే బాలినేని పార్టీ మారుతారా లేక రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా తెలియాలంటే.. ఇంకొన్ని నెలలు వేచిచూడాల్సిందే.