చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి ఘాటుగా స్పందించారు. ఆధారాలు లేకుండా ఏ చట్ట ప్రకారం ఆయనను అరెస్టు చేశారని నిలదీశారు. తన కోసం కాకుండా రాష్ట్రం ఏమవుతుందోనని చంద్రబాబు బాధపడుతున్నారని తెలిపారు. నైతికంగా దెబ్బతీయాలని చూస్తే మరింత బలపడతామని స్పష్టం చేశారు. దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటు తప్పదని సీఎం జగన్ ను హెచ్చరించారు.
రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
తప్పు చేయని వ్యక్తి శివుడికి కూడా భయపడడని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని నియంతృత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ తరఫున కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. భవిష్యత్తులో కలిసికట్టుగా పోరాడుతామన్నారు. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తేల్చిచెప్పారు.
రాజమండ్రి జైలులో గంజాయి స్మగ్లర్లు, నేరస్థులు ఉన్నారని లోకేశ్ అన్నారు.
చంద్రబాబుకు జైలులో భద్రత ఎలా ఉంటుంది? ప్రశ్నించారు. ప్రజల తరఫున మాట్లాడితే అడుగడుగునా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని అవమానించారని.. తనను దూషించారని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణిపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు.
చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదన్నారు లోకేశ్. హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబు అని లోకేశ్ పేర్కొన్నారు. సైబర్ టవర్స్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారని వివరించారు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని ఆరోపించి చంద్రబాబుపై కేసు పెట్టారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసు పెట్టారని లోకేశ్ ఆరోపించారు. పాదయాత్రలో రాళ్లదాడి చేసి తనపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. రాజమండ్రిలో ప్రజల తరఫున పోరాడుతున్న టీడీపీ, జనసేన నాయకులపై కేసులు పెట్టారన్నారు. మీడియా గొంతు నొక్కేందుకు జీవో తీసుకువచ్చారని విమర్శించారు.
అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని.. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.