Pinnelli Ramakrishna reddy bail news(Latest news in Andhra Pradesh): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం ఎంతగానో ఎదురుచూసిన పిన్నెల్లికి ఈ రోజు కూడా ఆశాభంగమే కలిగింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ రోజు ఏమీ తేల్చకపోవడంతో పిన్నెల్లి ఉసూరుమన్నారు.
పల్నాడు పోలీసులు పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్లపై సానుకూల తీర్పు రాకపోవడంతో ఆయన హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
Also Read: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసిందిరోయ్.. ఎన్టీఆర్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే
మే 13వ తేదీన పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేసినందుకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. ఈ ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ పైనా దాడి చేశారు. మరుసటి రోజు పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, వారి అనుచరులు సీఐపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా ఉపశమనం కలిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ వేశారు. కానీ, కోర్టు ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది.