Ayyannapatrudu as Speaker!: ఆంధ్రప్రదేశ్లో కొత్త స్పీకర్ ఎవరు? కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకో పేరు బయటకు వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పేరు దాదాపుగా పార్టీ హైకమాండ్ ఖరారు చేసినట్టు సమాచారం.
అయ్యన్నపాత్రుడు పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ పోస్టును బీసీలకే ఇవ్వాలని అధినేత భావించారు. అయ్యన్నతోపాటు కళావెంకట్రావు రేసులో ఉన్నారు. చివరకు అయ్యన్న వైపు నేతలంతా మొగ్గు చూపారు. డిప్యూటీ స్పీకర్గా ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టును జనసేన ఇవ్వాలని భావిస్తోంది. నెల్లిమర్ల నుంచి లోకం మాదవితోపాటు మరొకరు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చీఫ్ విప్గా దూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం పార్టీలో సీనియర్ నేతల్లో అయ్యన్నపాత్రుడు ఒకరు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆ పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు సీఎం చంద్రబాబునాయుడు. ఈసారి కూటమిగా పోటీ చేయడంతో చాలామంది సీనియర్లకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు. సీనియర్ల సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని సీఎం చంద్రబాబు పదేపదే చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వానికి-పార్టీకి వీరి సేవలు అవసరమని అన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు సీనియర్లంతా విజయవాడకు వెళ్లారు. సీనియర్ నేతలను తన ఛాంబర్లోకి పిలిచి ఒక్కొక్కరితో దాదాపు అరగంటకు పైగా మంతనాలు సాగించారు సీఎం చంద్రబాబు. కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో యువకులకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారని, ఒకప్పుడు తమకు ఎన్టీఆర్ అలాగే ఇచ్చారని సీనియర్ నేతలు వివరించారు.
ALSO READ: లోగుట్టు బయటకు, వచ్చేవారం రుషికొండకు సీఎం చంద్రబాబు! మాయామహల్ సందర్శన..
ఇక కేబినెట్లో స్థానం కల్పించలేని నేతలకు నామినేటెడ్, కీలక పదవులను అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఈనెల 18న చంద్రబాబు కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఈలోగా స్పీకర్, చీఫ్ విప్ పదవులను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 19న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.