ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎక్కువ సీట్లు కలిగిన పార్టీకి సాధారణంగా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే శాసనసభ లేదా లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభించడం సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఆ క్రమంలో ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉంటే .. కనీసం 18 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. వైసీపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. తమకు పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్పీకర్కి లెటర్ రాశారు. అయితే పది శాతం సీట్లు లేని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని శాసనసభ వ్యవహరాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
అదే సమయంలో గతంలో జగన్ టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే సాధించిందని నలుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఆ కామెంట్స్ గుర్తుచేస్తూ.. 11 సీట్లు సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా లభిస్తుందని కేశవ్ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించే పరిస్థితి లేదనేది స్పష్టమవుతున్నా జగన్ మాత్రం తన పంతం వీడటం లేదు.
తమకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కి దాఖలు చేసిన దాంట్లో 1953 ఏపీ యాక్ట్ ని మెన్షన్ చేశారు..అధికార పక్షం కాకుండా విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీని ప్రతిపక్షంగా గుర్తించవచ్చని ఆ యాక్ట్లో ఉంది. అది కూడా స్పీకర్ విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తనకు హోదాపై జగన్ కోర్టు తలుపు తట్టారు. కోర్టు స్పీకర్ కార్యదర్శికి అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇష్యూ చేసింది. ఆ తరువాత విచారణ ఎలా జరుగుతుంది, అసలు ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
Also Read: జగన్కు మరిన్ని కష్టాలు.. మెడకు లిక్కర్ స్కామ్.. వాసుదేవరెడ్డి అరెస్ట్!
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం తర్వాత ఒకేఒక్కసారి అసెంబ్లీకి వచ్చిన జగన్ తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతారన్న నమ్మకం వైసీపీ శ్రేణుల్లోనే కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత హోదా డిమాండ్ను అడ్డంపెట్టుకుని ఆయన అసెంబ్లీకి దూరంగా ఉండటానికే ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. మాట్లాడితే బెంగళూరు వెళ్లిపోతున్నారు. అదేమంటే అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు .. మీడియా ముందు తన వాయిస్ వినిపిస్తానని ప్రకటిస్తున్నారు.
జగన్తో పాటు వైసీపీ నుంచి గెలిచిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా గత అసెంబ్లీ సెషన్స్కు హాజరు కాలేదు. దానికి సంబంధించి స్పీకర్ అయన్నపాత్రుడు తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకీ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంటుందని.. అందుకు వైసీపీ ఎమ్మెల్యేలేమీ అతీతులు కారని స్పీకర్ పేర్కొన్నారు.
వారు కూడా అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో మాట్లాడవచ్చని జగన్ సమావేశాలకు హాజరై.. సార్ అంటూ చెయ్యెత్తితే.. తప్పకుండా మాట్లాడే అవకాశం కల్పిస్తానని శాసన సభాపతి తాజా తిరుపతి పర్యటనలో స్పష్టం చేశారు.
జగన్ తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని, అప్పుడే సమావేశాలకు హాజరవుతాననటం సహేతుకం కాదంటున్న స్పీకర్.. అది చట్టబద్ధమైన అంశమని … చట్టానికి లోబడే ఆ హోదా కల్పిస్తారని స్పష్టం చేశారు. ఈసారి 175 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 88 మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారని సీనియర్లతో పాటు వారికీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని… వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మొత్తమ్మీద జగన్ అసెంబ్లీలో చెయ్యెత్తి .. సార్ అంటే.. మాట్లాడే అవకాశమిస్తామని స్పష్టం చేసిన స్పీకర్ ఆయన్ని సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు .. మరి జగన్ తన హోదా డిమాండ్ నెరవేరకపోతే.. అసెంబ్లీలో కనిపిస్తారోలేదో చూడాలి.