AvinashReddy: అవినాష్రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా పడింది. బుధవారం ఉదయం పదిన్నరకు విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరుగుతున్నందున.. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోర్టులోనే ఉన్నందునా.. అవినాష్రెడ్డి విచారణను వాయిదా వేసుకుంది సీబీఐ. బుధవారం నాటి విచారణకు అవినాష్ సహకరిస్తారని అతని తరఫు లాయర్లు తెలిపారు.
అంతకుముందు హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రాజకీయ కారణాలతోనే అవినాష్ను ఇరికిస్తున్నారని.. ఆయన తరుఫు లాయర్ కోర్టుకు తెలిపాడు. హత్యతో సంబంధమున్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారన్నారు. ప్రధాన నిందితుడు దస్తగిరి మీడియాతో మాట్లాడిన విషయాన్ని సునీత సమర్థించారని.. హంతుకులను వదిలేసి.. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వెంట పడ్డారని వాదనలు వినిపించారు. వ్యాపార లావాదేవీల్లో గంగిరెడ్డితో వివేకాకు విభేదాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలున్నాయని సీబీఐ వాదనలు వినిపించింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసామని న్యాయస్థానానికి వెల్లడించింది. హత్యకేసులో 40 కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించామన్న సీబీఐ.. హత్య జరిగాక సాక్ష్యాలు తారుమారు చెయ్యటంలో అవినాష్ రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపింది.
వివేకా తలకు బ్యాండేజ్ వేసి.. సహజమరణంగా చిత్రికరించారని సీబీఐ వాదించింది. ఉదయ్కుమార్ తండ్రి జయప్రకాష్ రెడ్డి చేత ఇదంతా చేయించారని తెలిపింది. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని న్యాయస్థానంలో సీబీఐ వాదనలు వినిపించింది.
వివేకా హత్య జరిగిన వెంటనే అవినాష్ స్పాట్ కి వచ్చారని.. గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించారని సీబీఐ తెలిపింది. వివేకా హత్యకు వాడిన మారణాయుధం గురించి తెలియాల్సి ఉందన్న సీబీఐ.. విచారణకు వచ్చిన అవినాష్ సరైన సమాధానాలు ఇవ్వలేదని వెల్లడించింది. సునీత తరఫు లాయర్లు కూడా ఇదే వర్షన్ వినిపించారు.