Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
అవినాష్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లో కీలక అంశాలు ప్రస్తావించారు. వివేకా కుమార్తె సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్తో కుమ్మకయ్యారని ఆరోపించారు. ఈ కేసులో కుట్ర పన్ని తనను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి కోరారు. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ తన వద్ద ఉంచుకుందని తెలిపారు. అక్కడే దస్తగిరిని అప్రూవర్గా మార్చారని ఆరోపించారు. 2021లో సీబీఐ ఛార్జ్షీట్లో తనను అనుమానితుడిగా చేర్చిందని గుర్తు చేశారు. తనపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
సునీత, వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి.. తన పిటిషన్ లో పేర్కొన్నారు. రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తామని వివేకా హామీ ఇచ్చారని .. అక్కడే విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డిని సహనిందితుడిగా చేర్చి విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్కు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.