CBI : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మళ్లీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని మరోసారి విచారించనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు ఆయనను సీబీఐ ప్రశ్నించింది. అయితే గత 20 రోజులుగా ఈ కేసు విచారణ చేపట్టలేదు.
ప్రస్తుతం అవినాష్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు. మంగళవారం ఉదయం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటనకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. సీబీఐ నోటీసులు నేపథ్యంలో ఆ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి పాత్ర, ప్రమేయం ఉందని సీబీఐ అంటోంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ అంటోంది. ఈ నేపథ్యంలోనే అవినాష్రెడ్డి విచారణపై ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజులుగా వివేకా హత్య కేసు విచారణకు తాత్కాలికంగా సీబీఐ విరామిచ్చింది. ఆ సమయంలో డిల్లీ వెళ్లిన సీబీఐ బృందం సోమవారమే తిరిగి హైదరాబాద్కు చేరుకుంది.
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సీబీఐ విచారణకు వెళ్లారు. అయితే అప్పుడే అరెస్ట్ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ సీబీఐ మాత్రం అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని సీబీఐ పిలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉదయ్కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇస్తే.. దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.