Viveka Murder Case: అంతా అవినాష్రెడ్డినే చేశారంటోంది సీబీఐ. నాకేం తెలీదు.. నాకు సంబంధం లేదంటున్నారు ఎంపీ. సీబీఐ మాదిరే వైఎస్ సునీత మాత్రం అవినాష్ను వదలడం లేదు. సుప్రీంకోర్టు కెళ్లి మరీ ఆయన్ను కార్నర్ చేస్తున్నారు. రేపేమాపో అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతుండగా.. అసలు జరిగింది ఇదీ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు. తాను సచ్చీలుడినంటూ గట్టిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. బంతిని తన కోర్టు నుంచి బయటకు తన్నే ప్రయత్నం గట్టిగా చేశారు. ఇంతకీ అవినాష్రెడ్డి విడుదల చేసిన వీడియోలో ఏమన్నారంటే…
వివేకా లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. “వివేకా హత్య తర్వాత శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. వివేకా మరణించినట్టు శివప్రకాష్ రెడ్డే నాకు చెప్పారు. నేను అప్పటికే జమ్మలమడుగు బయలుదేరాను.
పులివెందుల రింగ్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు కాల్ వచ్చింది. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని వివేకా పీఏ కృష్ణారెడ్డిని అడిగాను. ఎలాంటి అనుమానాలు లేవని వివేకా పీఏ చెప్పారు. మేము వెళ్లకముందే లేఖను, మొబైల్ను దాచిపెట్టారు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దని లెటర్లో వివేకా రాశారు. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిని కాపాడేందుకు.. మా జీవితాలను నాశనం చేస్తున్నారు”.. అంటూ అవినాష్ చెప్పుకొచ్చారు.
కేసు దర్యాప్తులో సీబీఐ తీరుపై అవినాష్రెడ్డి విమర్శలు గుప్పించారు. సీబీఐ పెద్ద ఏజెన్సీ కానీ.. పేరు గొప్ప ఊరు దిబ్బ. ఆధారాలు లేని ఆరోపణలతో బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారు. సీబీఐపై పోరాడతాం, సునీతపై పోరాడతాం. న్యాయపోరాటంలో తప్పకుండా మేం గెలుస్తాం. సునీతకు రెండు టార్గెట్లున్నాయి.. ఒకటి.. కేసు నుంచి తన భర్తను బయటకి తీసుకురావాలి. రెండోది.. ఆ కేసులో నన్ను, మా నాన్నను ఇరికించాలి. వైసీపీని దెబ్బ తీయడానికే చంద్రబాబు, బీజేపీలోని టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారు. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయంటూ అవినాష్రెడ్డి రాజకీయ దాడి చేశారు. అవినాష్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.